Mahesh Babu - Rajamouli Movie Title: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకోకపోయినా.. దీనిపై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూ వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టైటిల్ చూసి చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇది అయినా నిజమవుతుందా లేదా ఇతర వార్తల్లా రూమర్‌లాగా మిగిలిపోతుందా తెలియాలంటే మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిందే.


‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే..


మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. అందుకే ఈ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇది నిజమా కాదా అని తెలియక ముందే సోషల్ మీడియాలో ఈ టైటిల్ తెగ చక్కర్లు కొడుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లతో కలిసి మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్నట్టు రాజమౌళి ప్రకటించారు. అదే సమయంలో ముగ్గురి పేర్లు ‘ఆర్’ అనే అక్షరంతో ప్రారంభమవుతూ ఉండడంతో #RRR అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ మొదలుపెట్టారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ‘ఆర్ఆర్ఆర్’ అనే టైటిల్ ప్రేక్షకుల మైండ్‌లో రిజిస్టర్ అయిపోయింది. దీంతో టైటిల్ మార్చడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో ‘ఆర్ఆర్ఆర్’నే అఫీషియల్ టైటిల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.


చాలా ఏళ్ల తర్వాత..


‘మహారాజా’ అనే టైటిల్ చాలా బాగుందంటూ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పటికే మహేశ్ కెరీర్‌లో ‘రాజకుమారుడు’, ‘యువరాజు’లాంటి సినిమాలు ఉన్నాయి. అప్పటినుండి ఇప్పటివరకు అలాంటి టైటిల్‌తో మహేశ్ సినిమా చేయలేదు. ఫైనల్‌గా రాజమౌళితో తెరకెక్కనున్న మూవీకి ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం. ఇక ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయ్యిందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి.. ఈ సినిమాలో నటించే నటీనటుల కోసం వెతకడం మొదలుపెట్టారు. అదే క్రమంలో ఒక ఇండోనేషియన్ నటి.. ఈ చిత్రంలో భాగం అవ్వనుందని వార్తలు వచ్చాయి.


ఇంకా ఫైనల్ చేయలేదు..


చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ నటి.. మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. అమెరికాలో పుట్టిన చెల్సియా.. ఇండోనేషియన్ భాషలో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మహేశ్, రాజమౌళి మూవీలో తను కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని చెల్సియా ఫాలో అవ్వడంతో ఇవి రూమర్స్ కాదు.. నిజమే అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి తాజాగా రాజమౌళి టీమ్ ముందుకొచ్చింది. ఈ సినిమాలో చెల్సియా భాగం కాదని తేల్చి చెప్పింది. ఇంకా వారు ఏ నటీనటులను ఫైనల్ చేయలేదని బయటపెట్టింది.


Also Read: ‘శక్తిమాన్’గా వస్తున్న రణవీర్ సింగ్ - దర్శకుడు ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!