Robbery in Director Manikandan House: జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు మణికందన్‌ ఇంట్లో చోరీ జరగడం కోలీవుడ్‌లో కలకలం సృష్టించింది. నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఇక ఈ కేసులో తాజా అప్డేట్ ఏంటంటే.. ఆ దొంగలు ఎవరో కానీ ఈ దర్శకుడిపై జాలిపడి తన అవార్డులను తిరిగి ఇచ్చేశారు. ఇది విన్న ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. డబ్బు, నగలను దొంగలించిన దుండగులు.. అవార్డులను మాత్రం మణికందన్ ఇంటి గేట్ దగ్గర వదిలేసి వెళ్లిపోయారట. వాటితో పాటు ఒక లేఖను కూడా రాశారట. ఇది విన్న తర్వాత వీరు కేవలం దొంగలు కాదు.. మంచి దొంగలు అంటూ నెటిజన్లు ట్యాగ్ ఇస్తున్నారు.


మీ కష్టం మీదే..


‘‘మమ్మల్ని క్షమించండి సార్, మీ కష్టం మీదే’’ అనే ఓ లేఖను రాసి మధురైలోని ఉసిలంపట్టిలో ఉండే మణికందన్ ఇంటి గేటుకు పెట్టేసి వెళ్లిపోయారు దొంగలు. కొన్నిరోజుల క్రితం అదే ఇంట్లో దొంగతనం చేసి.. ఇప్పుడు అదే ఇంటికి తిరిగొచ్చి లేఖ పెట్టేసి వెళ్లిపోవడంపై ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ నోట్‌తో పాటు మణికందన్ నేషనల్ అవార్డుల వేడుకలో సాధించుకున్న రెండు మెడల్స్‌ను కూడా దొంగలు అక్కడే వదిలేశారు. ఒక లెటర్, ఒక కవర్‌లో రెండు మెడల్స్ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ దొంగలపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దొంగలించబడిన వస్తువులు, డబ్బు తిరిగి రాలేదని, కేవలం అవార్డులు మాత్రమే వెనక్కి ఇచ్చారని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.


దీనిపై కూడా సినిమా..


తన ఇంట్లోనే చోరీ జరిగినప్పుడు కూడా దర్శకుడు మణికందన్ దానిపై స్పందించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు దొంగలు.. తన అవార్డులను తిరిగి ఇచ్చినా కూడా దీనిపై ఎలాంటి రియాక్షన్ లేదు. ఎక్కువశాతం తన చుట్టూ జరిగే నిజ జీవిత సంఘటనలకు కాస్త ఫిక్షన్‌ను యాడ్ చేసి తెరకెక్కించడంలో మణికందన్ విజయం సాధించాడు. ఇప్పుడు తన ఇంట్లోనే చోరీ జరిగి, తర్వాత అవార్డులు తిరిగి ఇచ్చేయడం గురించి కూడా తను ఒక సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని దర్శకుడికి నెటిజన్లు సలహా ఇస్తున్నారు. తాను తెరకెక్కించిన ‘కడసియ వ్యవసాయి’, ‘కాక ముట్టయ్’ వంటి చిత్రాలకు మణికందన్‌కు నేషనల్ అవార్డులు దక్కాయి.


వెబ్ సిరీస్‌తో బిజీ..


ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన మణికందన్ ఆ తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. అదే టైంలో మణికందన్ విండ్ అనే షార్ట్ ఫిల్మ్‌లో డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మాతగా ఆయనకు తొలి అవకాశం ఇచ్చారు. ఆయన సపోర్టు మణికందన్‌ ‘కాకా ముట్టై’ సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వడమే కాదు 62వ నేషనల్ అవార్డుల్లో రెండు పురస్కారాలను దక్కించుకుంది.అంతేకాదు 13వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో కూడా బెస్ట్ ఫీచర్ ఆడియన్స్ సినిమాగా అవార్డును సైతం కైవసం చేసుకుంది. మణికందన్.. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ  వెబ్ సీరీస్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న ఈ సిరీస్.. షూటింగ్ దశలో ఉంది.


Also Read: సౌత్‌ ఫిలిం మేకర్స్‌పై బాలీవుడ్‌ హీరో, 'ఓజీ' విలన్‌ ఇమ్రాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు