'ది కేరళ స్టోరీ' సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు చెలరేగాయో తెలిసిందే. ఎన్నో విమర్శలు, ఆందోళనల మధ్య ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాపై విశ్వనటుడు, మక్కల నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టే కమల్.. ఇదొక ప్రొపగాండా సినిమా అని, అలాంటి ప్రచార చిత్రాలకు తాను వ్యతిరేకమని అన్నారు. అయితే ఈ కామెంట్స్ పై డైరెక్టర్ సుదీప్తో సేన్ స్పందించారు. సినిమా చూడని వ్యక్తులు మాత్రమే దీనిని ప్రొపగాండాగా సూచిస్తారని అన్నారు.


మూవీ ప్రమోషన్స్‌ తో బిజీగా గడిపిన సుదీప్తో సేన్.. ప్రస్తుతం డీహైడ్రేషన్, ఇన్‌ఫెక్షన్ సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఇదే క్రమంలో ప్రొపగాండా సినిమా అనే విమర్శల గురించి మాట్లాడుతూ.. భారతదేశంలో 'చాలా స్టుపిడ్ స్టీరియోటైప్స్' ఉన్నాయని పేర్కొన్నాడు. "ఇంతకుముందు నేను వివరించడానికి ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నేను అలా చేయడం లేదు. ఎందుకంటే ఈ సినిమా చూడని వారే ప్రచార(ప్రొపగాండా) చిత్రం అని విమర్శిస్తున్నారు. చూసిన తర్వాత బాగుందని అన్నారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల చేయలేదు. అక్కడి వాళ్ళు సినిమా చూడలేదు కాబట్టి ఇది ప్రొపగాండా అని వారు భావిస్తున్నారు" అని అన్నారు. 


"మన దేశంలో చాలా తెలివితక్కువ మూసలు ఉన్నాయి... జీవితం నల్లగా లేదా తెలుపుగా ఉండాలి, బూడిద రంగులో జీవితం ఉందని వారికి తెలియదు" అని సుదీప్తో సేన్ వ్యాఖ్యానించారు. బీజేపీకి సినిమా నచ్చితే, అది వారి సినిమా అయినట్లు కాదన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదు, ఏ రాజకీయ పార్టీకైనా ఇదే సూత్రం వర్తిస్తుందని.. ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని అంతర్జాతీయంగా 37 దేశాల్లో ప్రజలు ఇష్టపడుతున్నారని తెలిపాడు. విమర్శకులు కూడా ఫోన్ చేసి మరీ నాతో వారి అభ్యంతరాల గురించి చర్చిస్తున్నారని, కానీ సినిమా చూడకుండా దీన్ని ప్రచార చిత్రంగా అభివర్ణిస్తే వారిక ఎలా వివరించగలనని దర్శకుడు అన్నారు .


సుదీప్తో సేన్ దర్శకత్వంలోని అదాశర్మ, సిద్ధి ఇధ్నాని తదితరులు ప్రధాన పాత్రల్లో 'ది కేరళ స్టోరీ' సినిమా తెరకెక్కింది. కేరళలోని హిందూ యువతులను ట్రాప్ చేసి ఇస్లాంలోకి మతమార్పిడి చేయడం, వారిని బలవంతంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం అనేది ఈ సినిమా కథాంశం. అయితే ట్రైలర్‌ లో కేరళ నుంచి 32,000 మంది మహిళలను ISIS రిక్రూట్ చేసుకున్నట్లు పేర్కొనడంతో వివాదం చెలరేగింది. దీనిపై కేరళ సీఎం సహా పలువురు నాయకులు, రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కోర్టు సూచనతో ట్రైలర్‌ లో స్టేట్మెంట్ ను మార్చబడినప్పటికీ, ఈ సినిమా ద్వారా 'లవ్ జిహాద్' ఆలోచనను ప్రచారం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయగా.. మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు పన్ను రాయితీ ఇవ్వడం చర్చనీయంగా మారింది. 


ఎన్నో కాంట్రవర్సీల మధ్య వచ్చిన 'ది కేరళ స్టోరీ' విజయవంతమైన నేపథ్యంలో, కమల్ హాసన్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకిని. మీరు టైటిల్‌ కింద ‘నిజమైన కథ’ అని రాసుకుంటే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అయిపోదు’’ అని అన్నారు. 


ఇదిలా ఉంటే 'ది కేరళ స్టోరీ' సినిమా ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిన హీరోయిన్ అదాశర్మ ఇన్‌స్టా వేదికగా ఓ నోట్‌ రాసింది. దేశంలోని రెండు రాష్ట్రాలు దీనిపై నిషేధం విధించాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇది నేను అసలు ఊహించలేదు. నా అంచనాలకు మించి ఈ చిత్రం సక్సెస్ సాధించింది అని ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.