సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మా ఊరి పొలిమేర' సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కి ఆడియన్స్ తెగ భయపడిపోయారు. అంతలా ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మంచి కంటెంట్, కొత్త కాన్సెప్ట్స్, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ని తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ఈ సినిమా ద్వారా మరోసారి రుజువయింది. హాట్ స్టార్  ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 'మా ఊరి పొలిమేర' మూవీకి ఆడియన్స్ మౌత్ టాక్ బాగా ప్లస్ అయింది.


ఆ మౌత్ టాక్ వల్లే సినిమా మీద అందరి దృష్టి పడడంతో ఓటీటీలో ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దాదాపు సినీ లవర్స్ అందరూ హాట్ స్టార్ లో ఈ మూవీని చూశారు. సినిమా అంతా ఒకెత్తు అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్ కి అందరూ షాక్ అయ్యారు. సత్యం రాజేష్ మెయిన్ విలన్ అని చూపించే సీన్ సినిమాకి మెయిన్ హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమా చివర్లోనే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చెప్పారు. చెప్పినట్లుగానే త్వరలోనే 'మా ఊరి పొలిమేర' సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే 'మా ఊరి పొలిమేర'కు వచ్చిన రెస్పాన్స్ తో చిత్ర బృందం సీక్వెల్ ని థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.


ఇప్పటికే 'మా ఊరి పొలిమేర సీక్వెల్' కి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకున్నాయి. ముఖ్యంగా టీజర్ సీక్వెల్ పై అంచనాలను తారస్థాయికి చేర్చింది. దీంతో 'మా ఊరి పొలిమేర 2' ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. 'మా ఊరి పొలిమేర 2' చిత్రాన్ని నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు  అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో సత్యం రాజేష్ భయంకరమైన లుక్ లో కనిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేసి ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు.


మరోవైపు ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చూసి ఎంతగానో నచ్చి వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకున్నారట. శ్రీకృష్ణ క్రియేషన్స్ బారి పై గౌరు గణబాబు సమర్పణలో గౌరీ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, రాకేందు మౌళి, బాలాదిత్య, గెటప్ శ్రీను, రవివర్మ, సాహితి దాసరిజ్ చిత్రం శీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు  గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి 'మా ఊరి పొలిమేర 2' చిత్రాన్ని తెరకెక్కించగా మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ మరింత సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉండనున్నట్లు తెలుస్తోంది.


Also Read : ఒకరు గడ్డి తింటే మీరూ గడ్డి తింటారా - బండారు, రోజా వివాదంపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు



Join Us on Telegram: https://t.me/abpdesamofficial