ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరల విషయంపై హైకోర్టు సూచనలతో  ఏర్పాటైన కమిటీ సమావేశంలో మరోసారి అమరావతిలో జరిగింది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సినీ పరిశ్రమ తరపున హాజరైన ముత్యాల రాందాస్ టిక్కెట్ రేట్లను పెంచాలని కోరామని తెలిపారు. సినిమా టిక్కెట్ రేట్లపై కమిటీ రిపోర్ట్ కోసం టాలీవుడ్ మొత్తం ఎదుర చూస్తున్నారన్నారు. సినిమా టిక్కెట్ రేట్ల అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని .. ఇంకో మీటింగ్ జరిగితే క్లారిటీ వస్తుందని కమిటీలో చర్చలకు సెన్సార్ బోర్డు తరపున హాజరైన ఓం ప్రకాష్ తెలిపారు. 


ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరల అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా మారింది.  హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికి మూడు సార్లు సమావేశం అయింది.  ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లుతో పాటు ప్రేక్షుకుల సంఘం తరపున ప్రతీ సారి హాజరవుతున్నారు.  అయితే మూడు 0ర్లూ పెద్దగా చర్చలు జరగలేదు. తమ తమ డిమాండ్లను ఆయా వర్గాలు ప్రభుత్వానికి వినిపించాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ వాటిని నోట్ చేసుకుంది.సినిమా టిక్కెట్ల అంశంపై ఫిబ్రవరి పదో తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ లోపే కమిటీ భేటీలు పూర్తి చేసి ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. అలా చేస్తే కమిటీ నివేదిక ప్రభుత్వం వద్ద ఉందని.. ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు ఎదుట వాదించడానికి అవకాశం ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎంతెంత టిక్కెట్ ధరలు ఖరారు చేస్తుందో క్లారిటీ వస్తుంది.  దీని కోసం టాలీవుడ్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. టిక్కెట్ ధరల తగ్గింపు వల్ల సినీ పరిశ్రమ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. 


ఇప్పటికే ఈ అంశం టాలీవుడ్ - ఏపీ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెంచేసింది. ఇటీవల సీఎం జగన్ కూడా చిరంజీవితో లంచ్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా  టిక్కెట్ రేట్ల అంశంతో పాటు టాలీవు‌డ్ సమస్యలపై చర్చించినట్లుగా చెప్పారు.  కానీ ఆ తర్వాత మంత్రి పేర్ని నాని .. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఫార్మాలిటీనేనని .. పలకరింపుల కోసమేనని చెప్పారు. అధికారికం కాదన్నారు. దీంతో టాలీవుడ్‌లోనూ కలకలం రేగింది. తర్వాత సమావేశానికైనా  అధికారికంగా  చిరంజీవిని టాలీవుడ్ తరపున వచ్చి సమస్యలను కమిటీ ముందు చెప్పాలని ఆహ్వానించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.  


టిక్కెట్ల వివాదం పరిష్కారం కోసం టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు విడుదల తేదీలను మరోసారి ఖరారు చేశారు. అవి విడదలయ్యే నాటికి సమస్య పరిష్కారం అవుతుందని టాలీవుడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.