‘వారిసు’ బ్లాక్ బస్టర్ హిట్ తో తమిళ స్టార్ హీరో విజయ్ ఫుల్ జోష్ లో ఉండగా, ‘విక్రమ్’ సక్సెస్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ‘లియో’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్ యాక్ట్ చేస్తున్నారు. విజయ్ దళపతి తండ్రిగా సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇందులో తండ్రీకొడుకులు ఇద్దరూ గ్యాంగ్‌ స్టర్స్‌ గా కనిపించనున్నారు


‘పుష్ప 2’ రికార్డు బ్రేక్ చేసిన ‘లియో’


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి తెలుగు పోస్టర్ ను విజయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ పోస్టర్‌లో విజయ్ మంచు కొండల్లో చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు, ఈ పోస్టర్‌పై ‘‘Keep Calm, Avoid The Battle’’ అనే ట్యాగ్ కనిపించింది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఉగ్రరూపాన్ని చూపించారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. అంతేకాదు, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. పోస్టర్ షేర్ చేసిన కేవలం 32 నిమిషాల్లో ఏకంగా మిలియన్ లైక్స్ అందుకుంది. నిన్న(ఆదివారం)నాడు విడుదలైన ఈ పోస్టర్ ఇప్పటి వరకు దాదాపు మూడు మిలియన్ల లైక్స్ సాధించింది. ఇప్పటి వరకు ‘పుష్ప2’ పేరిట ఉన్న రికార్డును బీట్ చేసింది.






బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు 33 నిమిషాల్లో మిలియన్ లైక్స్


‘పుష్ప2’లో బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ 33 నిమిషాల్లో మిలియన్ లైక్స్ అందుకుంది. గంగమ్మ జాతరలో ఆడ వేషం వేసిన అల్లు అర్జున్ ఆహార్యాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు మేకర్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్టర్ కు 7 మిలియన్ లైక్స్ వచ్చాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే సంప్రదాయం ప్రకారం గంగమ్మ జాతరలో మహిళల తరహాలో పురుషులు ముస్తాబు కావడం ఆనవాయితీ. 'పుష్ప 2'లో ఆ గంగమ్మ జాతర నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నాయి.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇండియన్ మూవీ పోస్టర్ 7 మిలియన్ లైక్స్ అందుకోవడం ఇదే తొలిసారి.   






అక్టోబర్ 19న ‘లియో’ విడుదల


లియో అక్టోబర్ 19న రిలీజ్‌కి సన్నద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ తాజా పోస్టర్ విడుదల చేశారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్.లలిత్ కుమార్ ‘లియో’ను నిర్మిస్తున్నారు. జగదీష్ పళనిస్వామి ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 


భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘పుష్ప2’


అటు ‘పుష్ప2’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్ లతో పాటూ సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  


Read Also: నాగ చైతన్య రెండో పెళ్లి వార్తల్లో వాస్తవం లేదట- కానీ, ఆమెతో ప్రేమలో ఉన్నారట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial