Suresh Kondeti: మూవీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి గోవాలో నిర్వహించిన సంతోషం అవార్డ్స్‌లో కన్నడ స్టార్లకు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలపై సురేష్ క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ సీిరియస్ అయ్యింది. సురేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఖండించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్..
సురేష్ కొండేటి నిర్వహిస్తున్న సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో కన్నడ స్టార్లకు అవమానం జరగడంతో శాండిల్‌వుడ్ ఫ్యాన్స్ మొత్తం టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలుపెట్టారు. ఈ విమర్శలు టాలీవుడ్‌పై మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీపై, ఆఖరికి చిరంజీవి వరకు వెళ్లాయి. దీంతో ఫిల్మ్ ఛాంబర్‌కు కోపం వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు మచ్చ తీసుకొచ్చిన గోవాలోని సంతోషం అవార్డ్స్ నిర్వహణను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (టీఎఫ్‌సీసీ) ఖండించింది.


నిర్వహణ విషయంలో పొరపాట్లు..
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ మాత్రం తన కుటుంబం వరకు ఈ కాంట్రవర్సీ రాకుండా జాగ్రత్తపడ్డారు. సంతోషం అవార్డ్స్ నిర్వహణ పూర్తిగా సురేష్ కొండేటి బాధ్యత అని అన్నారు. ఈ విషయానికి సంబంధించి టీఎఫ్‌సీసీ లేఖలను కూడా విడుదల చేసింది. టీఎఫ్‌సీసీ సెక్రటరీ కేఎల్ దామోదర్ ప్రసాద్ దీనిపై మాట్లాడుతూ..  అల్లు అరవింద్‌తో పాటు తెలుగు సెలబ్రిటీలు కూడా సంతోషం అవార్డ్స్‌లో పాల్గొన్నారని, నిజంగానే అక్కడ నిర్వహణ బాలేకపోవడంతో సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారని, తామే స్వయంగా ముందుకు వచ్చి పరిస్థితిని మామూలుగా చేసే ప్రయత్నం చేశామని అన్నారు. నిర్వహణ విషయంలో పొరపాట్లు జరగడం సహజమే అంటూ సురేష్ ఇచ్చిన వివరణలో పూర్తిగా నిజాలు లేవని అసలు ఏం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టారు దామోదర్ ప్రసాద్.


ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్లిపోయారు..
కరెంటు విషయంలో నిర్వహకులకు పేమెంట్స్ ఇవ్వకపోవడంతో వారు కరెంటును కట్ చేస్తూ ఉన్నారని కేఎల్ దామోదర్ ప్రసాద్ బయటపెట్టారు. అలా జరుగుతున్న సమయంలోనే ఈవెంట్‌ను వదిలేసి సురేష్ కొండేటి ఎక్కడికో వెళ్లిపోయారని, సమస్యలు పరిష్కారం అవ్వకముందే.. గోవా నుంచి హైదరాబాద్ వచ్చేశారని అన్నారు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు. అందుకే అల్లు అరవింద్‌తో కలిసి అక్కడ పరిస్థితిని మామూలు చేసే ప్రయత్నం చేశారట. అవార్డ్స్ నిర్వహణ సరిగా జరగకపోవడంతో గోవా ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమపై, తెలుగు ప్రజలపై ఆగ్రహంతో ఉన్నారని, దీని వల్ల భవిష్యత్తులో షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.


మా కుంటుంబంలో ఎవరికీ అతడు పీఆర్వో కాదు: అల్లు అరవింద్


చాలా వార్తా సంస్థలు సురేష్ కొండేటీ మెగా కుటుంబానికి పీఆర్వోగా వ్యవహరిస్తున్నారని రాయడంతో అల్లు అరవింద్ స్పందించారు. ‘‘అవార్డుల ఫంక్షన్‌ను ఈ సారి గోవాలో నిర్వహించాడు. ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయ్యాడు, చేయలేకపోయాడు. అక్కడికి వెళ్లినవారు ఇబ్బంది పడ్డారు. అయితే, మీడియా మా కుంటుంబానికి చెందిన వ్యక్తులకు పీఆర్ఓ అని రాస్తున్నారు. దీంతో మా పీఆర్ఓకు కాల్ చేసి ఆయన పీఆర్వో అని ఎప్పుడైనా చెప్పారా అని అడిగాను. ఎప్పుడైనా ఫొటోల కోసం, మరేదైనా సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడు.. పీఆర్వో అని పేర్కోవడం కరెక్ట్ కాదు. అతను ఇండివిడ్యువల్‌గా ఏదో చేసుకున్నాడు. ఫెయిల్ అయ్యాడు. ఇతర భాషల వారికి కూడా ఇబ్బందులు కలిగాయి. వారు కూడా తెలుగు ఇండస్ట్రీని విమర్శిస్తున్నారు. అది ఒక వ్యక్తి చేసిన తప్పిదం. తెలుగు ఇండస్ట్రీలో మనుషులు ఇంతే అంటూ వారు మాట్లాడాన్ని చూసి బాధపడ్డాను. ఒక వ్యక్తి చేసిన దానికి ఎవరికో ఆపాదించడం మంచిది కాదు. ఆయన మాకుటుంబంలో ఎవరికీ పీఆర్ఓ కాదు. అది ఆయన పర్శనల్ ఫెయిల్యూర్. దాన్ని తెలుగు ఇండస్ట్రీ మీదకు తీసుకురావద్దని కోరుతున్నా’’ అని తెలిపారు. 


Also Read: వారిని ఘోస్ట్‌లా వెంటాడుతుంది, మీ పాదాలకు నమస్కరిస్తా - ‘యానిమల్’పై దర్శకుడిపై ఆర్జీవీ ప్రశంసలు