ప్రతి సినిమాకు ఓ దర్శకుడు ఉంటారు. అయితే... సినిమా మొదలైన తర్వాత ఒక్కోసారి దర్శకుడు వివిధ కారణాల వల్ల తప్పుకోవడం వల్ల మరొక దర్శకుడు పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు... 'హరిహర వీరమల్లు'. దానికి క్రిష్ జాగర్లమూడితో పాటు జ్యోతికృష్ణ పేరు దర్శకులుగా వేశారు. నవీన్ మేడారం దర్శకత్వంలో ప్రారంభమైన 'డెవిల్' థియేటర్లలోకి వచ్చేసరికి దర్శకుడిగా నిర్మాత అభిషేక్ నామా పేరు పడింది. అయితే... తెలుగులో ఓ సినిమా అసలు దర్శకుడి పేరు లేకుండా పడింది. అది ఏమిటో తెలుసా?

బాల‌కృష్ణ క‌థ‌తో రాజ‌శేఖ‌ర్ మూవీ!?దర్శకుడి ఆలోచ‌న‌, ఊహ‌ల నుంచే సినిమాకు పునాది పడుతుంది. దర్శకుడు లేకుండా అసలు సినిమా అనేది ఉండ‌దు. అందుకే దర్శకుడిని 'కెప్టెన్ ఆఫ్ ది షిప్' అని పిలుస్తుంటారు. ఓ సినిమా స‌క్సెస్ ఫెయిల్యూర్ ప్ర‌భావం హీరోల‌తో పాటు స‌మానంగా ద‌ర్శ‌కుల‌పై ఉంటుంది. 'కెప్టెన్ ఆఫ్ ది షిప్' అయినటువంటి డైరెక్ట‌ర్ పేరు లేకుండా సినిమా విడుదల అయితే?... ఆ ఊహే విచిత్రంగా ఉన్నా... తెలుగు చిత్రసీమలో అటువంటి సంఘ‌ట‌న ఒకటి జ‌రిగింది. ఆ వివరాల్లోకి వెళితే... 

యాంగ్రీ స్టార్ రాజశేఖ‌ర్‌ (Rajasekhar), వ‌డ్డే న‌వీన్ కథానాయకులుగా నటించిన సినిమా 'శుభ‌కార్యం' (Subhakaryam Movie). ఆ సినిమా 2001లో విడుదల అయ్యింది. టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టి దర్శకత్వంలో సీనియర్ నిర్మాత సి. క‌ళ్యాణ్ ఈ సినిమాను మొద‌లు పెట్టారు.

మ‌ధ్య‌లోనే త‌ప్పుకొన్న రవిరాజా పినిశెట్టి!చిత్రీకరణలో హీరో రాజ‌శేఖ‌ర్‌, దర్శకుడు ర‌విరాజా పినిశెట్టి మ‌ధ్య అభిప్రాయ‌ భేదాలు మొద‌ల‌య్యాయ‌ని ఫిల్మ్ నగర్ ఖబర్. దాంతో 'శుభ‌కార్యం' పూర్తి చేయకుండా సినిమా మధ్యలో ఉండగా ర‌విరాజా పినిశెట్టి త‌ప్పుకొన్నాడ‌ట‌.  ర‌విరాజా పినిశెట్టి అర్థాంత‌రంగా ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో 'బొబ్బిలి వంశం' ఫేమ్ అదియ‌మాన్ ద‌ర్శ‌క‌త్వంలో మిగిలిన సినిమాను ఎలాగోలా పూర్తి చేయించారు సి. క‌ళ్యాణ్.

తెరపై దర్శకుడిగా పేరు ఎందుకు లేదంటే!?సినిమా అంతా పూర్తి అయ్యాక సినిమాకు దర్శకుడిగా త‌న పేరు వేయాల‌ని ర‌విరాజా పినిశెట్టి కంప్లైంట్ చేయ‌డం అప్ప‌ట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దాంతో ఆయన పేరు వేయలేదు. అలాగని, అదియమాన్ పేరు కూడా వేయలేదు. దాంతో చివ‌ర‌కు దర్శకుడు పేరు లేకుండానే ఈ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. చివరకు ఇద్దరకూ క్రెడిట్ ఇవ్వ‌లేదు. దర్శకుడు పేరు లేకుండా రిలీజైన తెలుగు మూవీగా 'శుభ‌కార్యం' నిలిచింది.

Also Read: తమిళ హీరోలకు మనం హిట్స్ ఇస్తే... మనకు ఏమో తమిళ దర్శకుల నుంచి డిజాస్టర్లు!

'న‌ర‌సింహానాయుడు' కాపీగా 'శుభకార్యం' సినిమా!'శుభ‌కార్యం' మూవీ స్టోరీ బాల‌కృష్ణ బ్లాక్‌ బ‌స్ట‌ర్ మూవీ 'న‌ర‌సింహా నాయుడు' చిత్రానికి ద‌గ్గ‌ర‌ దగ్గరకు ఉంటుంది. చిన్న చిన్న మార్పులు మిన‌హా రెండు సినిమాల‌ స్టోరీ లైన్ ఇంచు మించు ఒకేలా సాగుతుంది. త‌మిళంలో సూప‌ర్ హిట్‌ అయిన నిలిచిన ఓ సినిమా ఆధారంగా 'శుభ‌కార్యం' తెర‌కెక్కింది. ఆ త‌మిళ మూవీ క‌థ‌ను కాపీ కొట్టి ర‌చ‌యిత చిన్ని కృష్ణ 'న‌ర‌సింహా నాయుడు' స్టోరీ రాశాడంటూ అప్ప‌ట్లో అత‌డిపై సి. క‌ళ్యాణ్ ఆరోప‌ణ‌లు చేశారు. 'న‌ర‌సింహా నాయుడు' బ్లాక్‌ బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా... 'శుభ‌కార్యం' మాత్రం విడుదల అయిన విష‌యం తెలియ‌కుండానే థియేట‌ర్ల‌లో నుంచి వెళ్లిపోయింది.

Also Readతెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?