Tamannaah: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకు తెలుగు వెర్షన్ గా రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా గుడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మూవీ గురించి ఓ స్పెషల్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడీ వార్త విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


‘భోళా శంకర్’ సీన్ బై సీన్ రీమేక్ కాదు: తమన్నా


ప్రమోషన్స్ భాగంగా నటి తమన్నా, దర్శకుడు మెహర్, నటుడు సుశాంత్ ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమన్నా ‘భోళా శంకర్’ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ మూవీ సీన్ బై సీన్ రీమేక్ కాదని వెల్లడించింది తమన్నా. ‘వేదాళం’ సినిమాలోని మెయిన్ థీమ్ ను మార్చకుండా చిరంజీవి ఇమేజ్, తెలుగు నేటివిటీకు తగ్గట్టుగా ఈ మూవీను దర్శకుడు తీర్చిదిద్దారని చెప్పింది. ‘భోళా శంకర్’ పూర్తిగా కొత్త వెర్షన్ అని పేర్కింది. ఇక ఈ మూవీ ప్రధానంగా సిస్టర్ సెంటిమెంట్‌ తో సాగనుందని తెలుస్తోంది. ఇప్పుడు తమన్నా వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చిరంజీవి మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా చేశారు. ఈ మూవీలో కూడా మూవీలోని కొన్ని పాత్రలు, క్లైమాక్స్ వంటివి మార్చి కమర్షియల్ హంగులతో మూవీను తెరకెక్కించారు. ఈమూవీ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ మూవీ కూడా చిరంజీవికి మంచి హిట్ అందిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు.


చిరంజీవి 100 అడుగుల భారీ కటౌట్..


మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి కమర్షియల్ మూవీతో మంచి హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు అదే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మెగాస్టార్. ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు. చాలా చోట్ల అభిమానులు భారీ కటౌట్ లు కడుతున్నారు. రీసెంట్ గా సూర్యపేటలో సుమారు 100 అడుగుల భారీ చిరంజీవి కటౌట్ ను ఏర్పాటు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇదే భారీ కటౌట్ అని టాక్. ఇది ఇప్పుడు ప్రత్యేకార్షణగా నిలుస్తోంది. మరోవైపు యూఎస్ఏలో మూవీకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు కూడా వేగంగా జరుగుతున్నాయని టాక్. మరి ఈ మూవీలో చిరంజీవి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారో చూడాలి. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ తదితరులు నటించారు. ఈ మూవీ ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


Also Read: అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - అనుకున్నదే జరిగింది!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial