తెలుగు తెర అరుంధతి, దేవసేన అనుష్క శెట్టి (Anushka Shetty) అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. తమ ఆరాధ్య కథానాయికను వెండితెరపై చూడటానికి వాళ్ళు మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. రెండు మూడు రోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం నిజమని యువి క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. ఆ మాటను అధికారికంగా చెప్పింది. అసలు వివరాల్లోకి వెళితే... 


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదల వాయిదా
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలుసు. అయితే... ఇప్పుడు ఆ తేదీకి రావడం లేదని, త్వరలో కొత్త విడుదల తేదీతో పాటు ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేదీ చెబుతామని చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పేర్కొంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా వేయక తప్పలేదని తెలియజేసింది. 


అనుష్క సినిమా థియేటర్లలో వచ్చి ఐదేళ్ళు అవుతోంది. 'భాగమతి' 2018లో వస్తే... ఆ తర్వాత ఆమె నటించిన 'నిశ్శబ్దం' ఓటీటీలో విడుదలైంది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి'లో అతిథి పాత్రలో కనిపించారంతే! సో, అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'జాతి రత్నాలు' విజయం తర్వాత నవీన్ పోలిశెట్టి సినిమా కోసం కూడా కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు యువి క్రియేషన్స్ షాక్ ఇచ్చిందని చెప్పాలి.


Also Read : ఎంపీగా గెలుస్తా - రాజకీయాలపై 'దిల్' రాజు సంచలన వ్యాఖ్యలు



ఆగస్టు 18న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'?
Miss Shetty Mr Polishetty New Release Date : ఆగస్టు 4న కాకుండా ఆగస్టు 18న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగలేదని, చెన్నైలో ఫైనల్ మిక్సింగ్ వర్క్ ఏదో పెండింగ్ ఉందని తెలిసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. నాలుగు భాషల్లో వాయిదా పడినట్లే.   


నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు .పి (Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.


Also Read : 'స్లమ్ డాగ్ హజ్బెండ్' రివ్యూ : కుక్కతో పెళ్లి అయితే - సినిమా ఎలా ఉందంటే?


'జీ' చేతికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'  
అనుష్క సినిమా శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ చేతికి వెళ్లాయి. అవును... 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' డిజిటల్ రైట్స్‌ను 'జీ' గ్రూప్ కొనుకోలు చేసింది. సినిమా విడుదలైన కొన్ని రోజులకు 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీ గ్రూప్ ఛానళ్లలో టెలికాస్ట్ చేస్తారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial