Sunny Deol : బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI) సన్నీ డియోల్ స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు. దర్శకుడు అనిల్ శర్మ, రాజ్ కుమార్ సంతోషి, రాహుల్ రావైల్ లతో కలిసి మాస్టర్ క్లాస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి.. సన్నీ కెరీర్ గురించి మాట్లాడారు. దీంతో సన్ని డియోల్ తన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. 


మంగళవారం గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI) సన్నీ డియోల్ తో పాటు ముగ్గురు దర్శకులు చిత్ర నిర్మాణంలో భాగంగా మాస్టర్ క్లాస్ కోసం వేదికపై వచ్చారు. ఈ సెషన్ లో 'ఘయల్', 'ఘటక్', 'దామిని' వంటి సూపర్ హిట్స్ తెరకెక్కించిన డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమ సన్నీ డియోల్ కి సపోర్ట్ చేయలేదని, అతని ప్రతిభకు న్యాయం చేయలేదని అన్నారు. ఈ సెషన్ కి సంబంధించిన ఓ వీడియోలో సన్నీ డియోల్ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడలేక చేతిలో మైక్‌తో కూర్చున్నట్లు కనిపించాడు. ఆ సమయంలో అక్కడున్న హోస్ట్ మీరు ఓకేనా? అని అడిగితే అప్పుడు సన్నీ తన కన్నీళ్ల తుడుచుకొని, ‘‘నేను చాలా ఎమోషనల్ అయ్యాను’’ అని చెప్పాడు. ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులందరూ చప్పట్లతో ఆయన్ని ఓదార్చారు.


ఇదిలా ఉంటే దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి ఇదే వేదికపై సన్నీ డియోల్ కి సంబంధించిన ఓ ఇన్సిడెంట్‌ను వివరించడంతోపాటు అతను తెరపై పోషించే పాత్రలో ఎంత ఎమోషనల్ గా ఉంటాడో తెలిపాడు. కాగా సన్నీ డియోల్ తో దర్శకుడు రాహుల్ రావైల్ 'అర్జున్', 'బేతాబ్' వంటి సినిమాలను తెరకెక్కించగా మరో దర్శకుడు అనిల్ శర్మ 'గదర్', 'గదర్ 2', 'అప్నే' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇక సన్నీ డియోల్ హీరోగా తన 20 సంవత్సరాల కెరీర్లో ఈ ఇయర్ 'గదర్ 2' తో మొదటి సోలో హిట్ ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సుమారు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకని సన్నీడియోల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.


అంతేకాకుండా ఇండియా వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న బాలీవుడ్ మూవీ 'పఠాన్' రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇక 'గదర్ 2' విషయానికొస్తే.. 2001లో వచ్చిన 'గదర్' చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. సన్నీ డియోల్ సరసన అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. 1971 లో ఇండో- పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో తారా సింగ్ గా సన్నీ డియోల్, సకీనా పాత్రలో అమీషా పటేల్, తారా సింగ్ కొడుకు పాత్రలో ఉత్కర్ష్ శర్మ నటించారు. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


Also Read : లేడీ రిపోర్టర్‌కు సల్మాన్‌ ముద్దు, నెట్టింట వీడియో వైరల్‌