SS Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా వెలిగిపోతున్న వారి సంఖ్య తక్కువే. అలాంటి వారిలో ఎస్ఎస్ తమన్ కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగులోని స్టార్ హీరోల ప్యాన్ ఇండియా చిత్రాలకు తమనే సంగీతాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా ఒక మ్యూజిక్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ చాలా బిజీగా గడిపేస్తున్నారు. అలాంటి తమన్.. తాజాగా ఒక ఆల్బమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ‘‘ఫస్ట్ లవ్’’ అనే ఆల్బమ్ సాంగ్‌ను లాంచ్ చేయడంతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అంతే కాకుండా తన జీవితంలో ఫస్ట్ లవ్ ఎవరు అనే విషయాన్ని బయటపెట్టారు.


చివరిగా ‘గుంటూరు కారం’..


‘‘నా ఫస్ట్ లవ్ మాత్రమే కాదు నేను ఇంకా ప్రేమిస్తుంది నా మ్యూజిక్‌నే. కచ్చితంగా ఎప్పటికీ అదే నా లవ్. నేను పుట్టినప్పుడే మా నాన్న నా చేతిలో స్టిక్స్ పెట్టారు. పాలడబ్బా కాకుండా నాకు ముందు స్టిక్సే ఇచ్చారు. అలా నా జీవితాన్ని మ్యూజిక్‌తోనే మొదలుపెట్టాను. సంగీతమే నాకు అన్ని. నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది దానికే’’ అని తెలిపారు తమన్. ఆయన చివరిగా ‘గుంటూరు కారం’ సినిమాలోని సంగీతంతో యూత్‌ను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ పాటను అయితే ఇప్పటికీ చాలామంది మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ విడుదలయ్యి దాదాపు 8 నెలలు అవుతున్న తమన్ నుండి మరొక తెలుగు చిత్రం రాలేదు. దీంతో తన అప్‌కమింగ్ మూవీస్ గురించి అప్డేట్స్‌పై తమన్ స్పందించారు.


ఎగ్జైటెడ్‌గా ఉంది..


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలకు కూడా తమనే సంగీతాన్ని అందిస్తున్నారు. అందుకే ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వమని కోరగా.. ‘‘ఓజీ, గేమ్ ఛేంజర్ విషయంలో నేనే ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయని మాకు కూడా ఎగ్జైటెడ్‌గానే ఉంది. గేమ్ ఛేంజర్ అయితే డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం. దాని గురించే వర్క్ చేస్తున్నాం. ఇంకా 1,2 నెలల్లో ఓజీ అప్డేట్స్ కూడా కచ్చితంగా వస్తాయి. అన్నీ భారీ స్థాయిలోనే ఉంటాయి. నేను కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. నేను నా జీవితంలో ఎంతో కష్టపడి పనిచేసిన సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వబోతున్నాయి. గుంటూరు కారం తర్వాత ఇది కూడా బ్రేక్. 9 నెలల తర్వాత ఈ సినిమాలు అన్నీ రాబోతున్నాయి’’ అని సంతోషం వ్యక్తం చేశారు తమన్.


బాలీవుడ్‌లోకి ఎంట్రీ..


‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే కాదు.. బాలకృష్ణ అప్‌కమింగ్ మూవీకి కూడా తమనే సంగీతాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా తమన్ ఇప్పటివరకు హిందీలో పలు చిత్రాలకు సంగీతాన్ని అందించినా.. మొదటిసారి ఒక భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజిక్ అందించడానికి సిద్ధమయ్యారు. అదే ‘బేబీ జాన్’. ఖలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బేబీ జాన్’తో తమన్ బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవ్వనున్నారు.



Also Read: ‘దేవర’ పాట కాపీనా? అనిరుధ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ - ఒరిజినల్ సాంగ్ అదేనంటూ ట్రోల్స్