సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. హీరోలు పాలిటిక్స్ కి లోకి రావడం చూస్తూనే ఉన్నాం. కానీ హీరోయిన్స్ విషయంలో అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒకప్పటి హీరోయిన్లు రాజకీయాల్లో మెప్పించారు. అయితే ఈ తరం నటీమణులు రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఈ తరంలో అగ్ర హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.


తన తండ్రి కమలహాసన్ ఎలాగో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి శృతిహాసన్ కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని పాలిటిక్స్ లోకి రాబోతుందని సోషల్ మీడియాలోనూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే విషయంపై శృతిహాసన్ స్పందించారు. స్వయంగా మీడియా ముందే పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. శృతిహాసన్ ఏదైనా ముక్కు సూటిగా చెబుతుంది. ఎవరికి భయపడదు. ఆమె స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. తనకు నచ్చింది చేస్తుంది. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గదు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తున్న శృతిహాసన్ రాజకీయాలకు వస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ ప్రస్తుతం మక్కల్ ఇయక్కమ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 


గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసింది. ఈ క్రమంలోనే శృతిహాసన్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా కోయంబత్తూర్ లో ఒక కార్యక్రమానికి హాజరైన శృతిహాసన్ కి ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె బదిలిస్తూ.." ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కానీ ఆసక్తి నాకు లేదు. నా దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచి కథలు ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంతోనే పనిచేస్తాను. నేను తమిళ అమ్మాయిని, ఎక్కువగా తమిళ చిత్రాలు చేస్తాను  ఇతర భాషల్లో మంచి కథలు దొరికితే అక్కడ కూడా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. శృతిహాసన్ వ్యాఖ్యలతో ఆమె పొలిటికల్ ఎంట్రీ పుకార్లకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు.


ఇక శృతిహాసన్ కెరియర్ విషయానికొస్తే.. టాలీవుడ్ లో రవితేజ సరసన 'క్రాక్' మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహరెడ్డి' వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన 'సలార్' (Salaar) మూవీలో నటిస్తోంది. ఈ మూవీ విజయం సాధించడం శృతిహాసన్ కి చాలా కీలకం. ఎందుకంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి, సలార్ హిట్ అయితే శృతిహాసన్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది.


Also Read : ‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల



Join Us on Telegram: https://t.me/abpdesamofficial