కన్నడ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న శివ రాజ్ కుమార్ అలియాస్ శివన్న గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఆయన, కన్నడతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ముందుంటారు.


ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న శివన్న దంపతులు


తాజాగా శివ రాజ్ కుమార్ దంపతులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి మౌళిక వసతులు లేని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం జిల్లా ఇంగలగి గ్రామ సమీపంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి విద్యాపీఠ రెసిడెన్షియల్ పాఠశాలను నటుడు శివరాజ్‌ కుమార్ మరియు అతని భార్య గీత దత్తత తీసుకున్నారు. కనీస వసతులు లేని పాఠశాలను శివన్న భార్య గీత తాజాగా సందర్శించారు. పాఠశాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. “ఈ పాఠశాల 2012 నుంచి నడుస్తున్నది. ఇక్కడ కనీస మౌళిక వసతులు లేవు. వాటిని మెరుగు పరచడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు మాకు శివ రాజ్‌ కుమార్,  గీత దంపతులు సహకారం అందిస్తామని చెప్పారు. వారి తోడ్పాటుతో మా పాఠశాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.  


మైసూరు శక్తిధామ పాఠశాల మాదిరిగా అభివృద్ధి చేయాలని నిర్ణయం   


‘వేద’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ పాఠశాల దుస్థితి శివన్న దంపతుల దృష్టికి వెళ్లింది. అప్పుడే వారు పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.  శివరాజ్‌కుమార్ ఈ పాఠశాలను మైసూరులోని శక్తిధామ పాఠశాల స్థాయికి అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. లైబ్రరీ, ప్రాక్టికల్ క్లాస్‌ రూమ్‌లు, ప్లే గ్రౌండ్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. వీరి నిర్ణయం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిందండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Also Read : వారసత్వం కోసమో, వివాహం కోసమో కాదు... మానసికంగా సిద్ధమైన తర్వాతే - ఉపాసన మదర్స్ డే పోస్ట్



శివ రాజ్ కుమార్ తాజాగా వేద అనే మూవీ లో హీరో గా నటించారు.  ఈ మూవీ కన్నడ లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. తెలుగులోనూ చక్కటి విజయం సాధించింది. ఈ చిత్రానికి హర్ష దర్శకత్వం వహించారు. ఈ మూవీ లో గనవి లక్ష్మణ్ , శ్వేత చెంగప్ప , ఉమ శ్రీ , అదితి సాగర్ కీలక పాత్రల్లో నటించారు. అర్జున్ జన్య సంగీతం అందించారు.  జీ స్టూడియో, గీతా పిక్చర్స్ బ్యానర్ల మీద ఈ మూవీని  గీతా శివ రాజ్ కుమార్ నిర్మించారు. అటు  ఉపేంద్ర, సుదీప్‌ తో కలిసి శివరాజ్‌ కుమార్‌ ‘కబ్జ’ అనే మల్టీస్టారర్‌ చిత్రంలో నటించారు.  శ్రియ హీరోయిన్‌గా నటించింది.. ఆర్‌ చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.  1960 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.    


Read Also: తెలుగు హెరిటేజ్ డేగా ఎన్టీఆర్ జయంతి, శతజయంతిగా అమెరికాలో ఫ్రిస్కో మేయర్ కీలక ప్రకటన