రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పుడు ‘ఖుషీ’ చిత్ర బృందాన్ని 'శాకుంతలం' రిజల్ట్ కలవరపెడుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా రూపొందింది. ఇటీవలే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఏ దశలోనూ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. నాసిరమైన విజువల్స్, గ్రాఫిక్స్ తో ఒక డైలీ సీరియల్ మాదిరిగా సినిమా తీశారని మేకర్స్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనికి తగ్గట్టుగానే వసూళ్ళు మరీ పేలవంగా ఉన్నాయి. దీంతో సామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా పయనిస్తోందని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి.

 

'శాకుంతలం' సినిమాపై సమంత బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకోవాలని గట్టిగా ప్రచారం కూడా చేసింది. కానీ ఆమెకు తీవ్ర నిరాశే ఎదురైంది. శకుంతల పాత్రలో సామ్ నటనపైనా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ పాత్రకు ఆమె సెట్ కాలేదని, సరిగా డబ్బింగ్ చెప్పలేకపోయిందని ట్రోల్ చేశారు. దీంతో ఎన్నడూ లేని విధంగా అగ్ర నటి చుట్టూ నెట్టింట నెగెటివిటే వచ్చి చేరింది. ఇదే ఇప్పుడు ‘ఖుషీ’ టీమ్ ని టెన్షన్ పెడుతున్నట్లు టాక్ నడుస్తోంది.

 

'మహానటి' తర్వాత సమంత - విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా 'ఖుషి'. ‘లైగర్’ చిత్రంతో ఫ్లాప్ అందుకున్న విజయ్‌కు.. ‘టక్ జగదీష్’తో నిరాశ పరిచిన డైరక్టర్ శివ నిర్వాణకూ ఈ సినిమా విజయం కీలకంగా మారింది. ఇప్పుడు 'శాకుంతలం' ప్రభావంతో సామ్‌ కూడా ‘ఫ్లాప్’ల జాబితాలోకి చేరింది. దీంతో ఆమెకు కూడా అర్జెంట్ గా ఒక హిట్ అవసరం.

 

నిజానికి 'ఖుషీ' చిత్రాన్ని గతేడాది క్రిష్మస్ సందర్భంగా డిసెంబర్ 23న నాలుగు దక్షిణాది భాషల్లో ఈ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ సమంత అనారోగ్య బారిన పడటంతో ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. అయితే మయోటైసిస్ నుంచి మెల్లగా కోలుకుంటున్న సమంత.. తిరిగి సెట్స్ లో అడుగుపెట్టడంతో సినిమా మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. 

 

‘ఖుషీ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. 2024 సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా విజయ్'D, సమంత, శివ నిర్వాణలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


 

ఇకపోతే ఖుషి చిత్రం నుంచి ఇప్పటి వరకూ బయటకి వచ్చిన టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు.