ఈరోజుల్లో సినిమా షూటింగ్స్ అనేవి మరీ గోప్యంగా జరపడం కష్టంగా మారిపోయింది. ఎలాంటి సినిమా అప్డేట్ అయినా ఆడియన్స్ దగ్గరకు వెళ్లడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా చేయకపోయినా.. ఆ మూవీ గురించి అప్డేట్స్ అన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. దీంతో పాటు షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ అవుతున్న వీడియోలు కూడా మేకర్స్‌కు తలనొప్పిగా మారాయి. షూటింగ్ లొకేషన్‌లో ఫోన్లు ఉపయోగించకూడదు అని చాలావరకు సెట్స్‌లో రూల్స్ ఉన్నా కూడా వీడియోలు లీక్ అవ్వడం మాత్రం ఆగడం లేదు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమాకు కూడా ఈ లీక్ బాధ తప్పలేదు. దీంతో షాకైన మేకర్స్ పోలీసులను ఆశ్రయించారు.


ఒక యంగ్ తమిళ డైరెక్టర్‌కు మొదటిసారి బాలీవుడ్ బాద్‌షాను డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది. తమిళంలో పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన అట్లీ.. షారుఖ్ ఖాన్‌కు తన కథను వినిపించి, తనతో సినిమా చేయడానికి ఒప్పించాడు. ఆ సినిమానే ‘జవాన్’. అసలు తమిళంలో కూడా అట్లీ చేసిన సినిమాలు కొన్నే.. కాబట్టి షారుఖ్ లాంటి స్టార్ హీరో ఇమేజ్‌కు తగినట్టుగా తన ‘జవాన్’ను తెరకెక్కించగలడా, ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేయగలడా అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్నా.. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్‌తో ఒక్కసారిగా ఆ సందేహాలు అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాడు అట్లీ. దీంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోవడంతో ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘జవాన్’ ఉండబోతుందని ప్రేక్షకులు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. ఇలా ఆడియన్స్‌లో ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ‘జవాన్‌’కు లీక్ వీడియోలు సమస్య వచ్చిపడింది.


షారుఖ్ ఫ్యాన్స్ ఆందోళన..
‘జవాన్’ సినిమా ప్రస్తుతం చాలావరకు ట్విటర్‌లో లీక్ అయ్యింది. అది ఎవరు చేశారు, ఎలా జరిగింది అన్న వివరాలు తెలియలేదు. కానీ మూవీ టీమ్‌కు తెలియకుండా ‘జవాన్’లోని చాలా సీన్స్ ట్విటర్‌లో లీక్ అయ్యాయి. మూవీ లీక్ విషయంపై షారుఖ్ ఖాన్, తన భార్య గౌరీ ఖాన్ స్థాపించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి సాంటాక్రూజ్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టు సాయంతో ట్విటర్‌లో లీక్ అయిన వీడియోలను తొలగించింది రెడ్ చిల్లీస్ సంస్థ. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా జరగడం షారుఖ్ ఫ్యాన్స్‌ను కలవరపెట్టినా.. ఆ లీక్ వీడియోలను ట్విటర్ నుంచి తొలగించారని తెలిసి కాస్త తృప్తిచెందారు.


సెక్షన్ 379 కేసు..
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన ప్రదీప్ నిమాని.. ‘జవాన్’ లీక్ వీడియోల గురించి పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కొన్ని ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఆ యూజర్ల సమచారాన్ని పోలీసులకు అందించారు ప్రదీప్. ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్‌లో ఫోన్లు ఉపయోగించకూడదని సీఎఫ్ఓ రూల్ పెట్టినా.. వీడియోలు ఎలా లీక్ అయ్యాయో అర్థం కావడం లేదని మూవీ టీమ్ వాపోతోంది. ప్రదీప్ నిమాని ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 (దొంగతనం) కింద కేసు నమోదు చేశారు. ఇక షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: ‘రోలెక్స్‌’ రాబోతున్నాడు.. క్లారిటీ ఇచ్చేసిన సూర్య!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial