కన్నడ కథానాయకుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty) టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తెలుసు. ఆయన నటించిన 'అతడే శ్రీమన్నారాయణ', '777 చార్లీ' చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ కన్నడ సెన్సేషన్ 'సప్త సాగర దాచే ఎల్లో'. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. తెలుగులో కూడా సినిమా విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 


తెలుగులో 22న 'సప్త సాగరాలు దాటి'
Sapta Sagaradaache Ello Movie : 'సప్త సాగర దాచే ఎల్లో'లో హీరోగా నటించడమే కాదు... రక్షిత్ శెట్టి నిర్మించారు! ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్. హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 'సప్త సాగరాలు దాటి' (Saptha Sagaralu Dhaati Movie) పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో అనువదించింది. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. 


నాని విడుదల చేసిన సినిమా ట్రైలర్
'సప్త సాగరాలు దాటి' ట్రైలర్ (Saptha Sagaralu Dhaati Trailer)ను ఈ రోజు నాని విడుదల చేశారు. అందులో హీరో హీరోయిన్ల మధ్య స్వచ్ఛమైన ప్రేమను చూపే ప్రయత్నం చేశారు. 


'సప్త సాగరాలు దాటి' ట్రైలర్ చూస్తే... ఇదొక విజువల్ అండ్ మ్యూజికల్ పోయెట్రీ అనే ఫీలింగ్ కలుగుతోంది. సముద్రం పక్కన ఊరి నుంచి వచ్చిన అమ్మాయి, సిటీలో అబ్బాయితో ప్రేమలో పడుతుంది. వీళ్ళ ప్రేమ కథను వచ్చిన అడ్డంకి ఏమిటి? హీరో ఎందుకు జైలుకు వెళ్ళాడు? అప్పుడు అమ్మాయి ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


'నేను నిన్ను ప్రేమించడానికి ముందు నా ఆనందం కోసం పాడేదాన్ని. ఎప్పుడో మారానో తెలియదు. ఇప్పుడు నీ కోసం పాడాలనిపిస్తోంది' అని హీరోయిన్ రుక్మిణి వసంత్ ఓ డైలాగ్ చెబుతారు. ఆమె సింగర్ రోల్ చేశారని తెలుస్తోంది. 'నీకు ఎప్పుడు చెప్పలేదు కానీ నా సముద్రానివి నువ్వు' అని మరో డైలాగ్ ఉంది. హీరో డైలాగ్ ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఉందీ ట్రైలర్లో!


Also Read - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్



హైదరాబాద్ సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీజర్, ట్రైలర్ బావున్నాయని, రక్షిత్ శెట్టికి సినిమాయే ప్రపంచం అని, తెలుగులో కూడా సినిమా విజయవంతం కావాలని అగ్ర నిర్మాత డి. సురేష్ బాబు ఆకాంక్షించారు. ''రక్షిత్ శెట్టి గారికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 'చార్లీ' సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది. అందుకని, తెలుగులో ఈ 'సప్త సాగరాలు దాటి' సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం'' అని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. 


'సప్త సాగర దాచే ఎల్లో' విడుదలైనప్పుడు ఎందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం లేదని తనను చాలా మంది ప్రశ్నించారని... కొన్ని సినిమాలను మనం తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని, వాటంతట అవే వెళతాయని రక్షిత్ శెట్టి తెలిపారు. తెలుగు గడ్డను సినిమా భూమిగా ఆయన అభివర్ణించారు. 


Also Read అక్కడ యోగిబాబు, ఇక్కడ సంపూర్ణేష్ బాబు - తెలుగులోకి తమిళ 'మండేలా'



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial