Samantha Ruth Prabhu : స్టార్ హీరోయిన్ సమంత, టాలీవుడ్ నటుడు నాగ చైతన్యల విడాకుల వివాదం మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విడాకులు తీసుకుని రెండు సంవత్సరాలు కావస్తున్నా.. ఇంకా పలు వార్తలు అదే టాపిక్ చుట్టూ తిరుగుతున్నాయి. కారణం రీసెంట్ గా సమంత ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్సే. తాను వైవాహిక జీవితంలో 100 శాతం ఇచ్చినా వర్కవుట్ కాలేదని, తన తప్పేం లేదని ఇటీవల సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక తాజాగా చైతో విడాకుల తర్వాత చీకటి జీవితంలో బతకాల్సి వచ్చిందంటూ భావోద్వేగపూరిత కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యా్ఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


'ఏ మాయ చేశావో'తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సమంత... తన అందంతో పాటు నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే పలు స్టార్ హీరోలతో నటించి మంచి హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సమయంలోనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు. అయినా ఏమాత్రం కుంగిపోకుండా.. అక్కడే ఆగిపోకుండా.. ఆస్పత్రిలో ఉండి కూడా యశోద సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేశారు. అలా లేడీ ఓరియెంటెడ్ పాత్రలో వచ్చిన యశోద సినిమా బాక్సీఫీస్ వద్ద హిట్ కొట్టడంతో సామ్ కాస్త ఊపిరి పీల్చుకుంది.


అయితే 2017లో నాగ చైతన్యతో ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అంటే అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు ప్రకటించారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ వెల్లడించారు. దీంతో వీరిద్దరి ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈ విషయంపై కొందరు నానా విమర్శలు చేయగా.. మరికొందరు మాత్రం సామ్ కు మద్దతుగా నిలిచారు. రీసెంట్ గా తన వైవాహిక బంధంపై స్పందించిన సామ్.. తన మ్యారేజ్ విషయంలో తాను 100శాతం ఇచ్చినా.. వర్కవుట్ కాలేదని కామెంట్ చేశారు. అల్లు అర్జున్ పుష్పలో ఊ ఉంటావా.. అనే ఐటెం సాంగ్ కు ఓకే చేయొద్దంటూ స్నేహితులతో పాటు కుటుంబసభ్యులూ ఒత్తిడి తెచ్చారని, కానీ తానేం తప్పు చేయలేదని, ఎందుకు నేరం చేసిన దానిలా దాక్కోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అందుకే ఆ సాంగ్ చేసినట్టు స్పష్టం చేశారు. 


ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన జూమ్ డిజిటల్స్ స్పీక్ ఈజీ సెగ్మెంట్ తో ఇంటరాక్షన్ లో పాల్గొన్న సామ్..  మరోసారి నాగచైతన్యతో విడాకులకు సంబంధించి సామ్ పలు కామెంట్స్ చేశారు. తాను ఆ క్లిష్ట సమయంలో చీకట్లో బతికానని, తనకు వచ్చే ఆలోచనలు కూడా అలాగే ఉండేవని సమంత తెలిపారు. ఆ ఆలోచనలు తనను నాశనం చేయకుండా, ముందుకు సాగాలనుకున్నానన్నారు. ఆ సమయంలో తనకు చాలా మంది దగ్గరి వాళ్లు తనకు తోడుగా నిలబడ్డారని చెప్పారు. ఇప్పటికీ తాను ఆ స్టేజ్ నుంచి బయటకు రాలేదని, కానీ ఆ చెడ్డ రోజులు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో సామ్ కూడా తమ వైవాహిక జీవితంలో 100శాతం ఇచ్చిందని అంగీకరించినప్పటికీ వారిద్దరూ మాత్రం కలిసి ఉండలేకపోవడం అక్కినేని ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది.


మళ్లీ కొత్తగా తెరపైకి వచ్చిన సామ్, నాగచైతన్యల విడాకుల వివాదం విషయంలో కొందరు సమంతను ప్రశంసిస్తుండగా, తన రాబోయే చిత్రంపై సింపతీ సాధించడం కోసమే ఇలా కామెంట్స్ చేస్తోందంటూ కొందరు నెటిజన్లు సమంతను టార్గెట్ చేస్తున్నారు. ఆమె తన సినిమా విడుదలకు ముందు తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతు గేమ్స్ ప్లే చేస్తోందని, సినిమాపై తనను ప్రమోట్ చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. ఇక ఇలాంటి ఆరోపణలపై సామ్ ఎలా స్పందిస్తారో చూడాలి.