సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ లో 'సలార్' కూడా ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండగా.. రిలీజ్ కి ముందే 'సలార్' సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. తాజాగా సలార్ మూవీ యూఎస్ లో టికెట్స్ ఫ్రీ సేల్స్ ద్వారా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. యూఎస్ లో ఆగస్టు 25 నుంచి 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. కానీ సోమవారం నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ని స్టార్ట్ చేశారు. పూర్తిస్థాయిలో అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయనప్పటికీ కొన్నిచోట్ల మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.


ఈ క్రమంలోనే బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లో సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే US అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా తాజాగా సలార్ ప్రీ సేల్స్ రూపంలో ఇప్పటికే లక్ష డాలర్లను(రూ.83లక్షలు) వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే 'సలార్' ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఖాయమని చెప్పవచ్చు. 'కేజిఎఫ్' సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేయడం, దానికి తోడు చాలా కాలం తర్వాత ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ నటిస్తుండడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ టీజర్ అయితే ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


మరోవైపు సినిమా రిలీజ్ కి టైం దగ్గర పడుతున్నా, మూవీ టీం ఇంకా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులో ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో 'సలార్' కి సంబంధించి రోజుకో వార్త వైరల్ గా మారుతుంది. సలార్లో యాక్షన్ సీక్వెన్స్ లు 'కేజీఎఫ్' ని మించి ఉంటాయని, క్లైమాక్స్ లో ఏకంగా వెయ్యి మందితో ప్రభాస్ తలపడతాడని, అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడనే న్యూస్ బయటకు వచ్చింది.


దీంతో ఈ న్యూస్ కాస్త సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. కాగా హోం బలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా.. 'కే జి ఎఫ్' సినిమాకి మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


Also Read : 'చంద్రయాన్ 3' పోస్ట్‌పై స్పందించిన ప్రకాశ్ రాజ్, అది జస్ట్ జోక్?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial