సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన 'చంద్రయాన్ 3' పై పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'చంద్రయాన్ 3' గురించి దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న వేళ ప్రకాష్ రాజ్ దీనిపై వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ పై నెటిజెన్స్ మండిపడుతున్నారు. దేశం కోసం అహర్నిశలు కష్టపడిన శాస్త్రవేత్తలను ప్రకాశరాజ్ అవమానించారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రోజున ప్రకాష్ రాజ్ 'చంద్రయాన్ 3'కి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. చంద్రయాన్ 3 ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ కానున్న నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్ పై ప్రకాష్ రాజ్ ఓ జోక్ పేల్చారు.


చంద్రుడి పైనుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన తొలి ఫోటో ఇదేనంటూ ఓ చాయ్ వాలా ఫోటోని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో ఆయనపై నెట్టింట విమర్శలు మొదలయ్యాయి. 'చంద్రయాన్ 3' ల్యాండింగ్ కు ముందు ఇస్రో మాజీ చీఫ్ కే శివన్ ని వెక్కిరిస్తూ చేసిన ట్వీట్ అని, ఇది ప్రకాష్ రాజ్ నుంచి వస్తుందని ఊహించలేదని కొంతమంది నెటిజెన్లు వ్యాఖ్యానించారు.' మీ దేశం, మీ ప్రజల పురోగతి, విజయాలు, ప్రయత్నాలను అసహ్యించుకునేంత ద్వేషం మీలో ఉందా.. ఇది సరికాదు' అంటూ ప్రకాష్ రాజ్ ని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా చాయ్ వాలా ఫోటోని పెట్టి ట్వీట్ చేయడంతో దీనిపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో బీజేపీ నేతలకు కౌంటర్ ఇస్తూ మరోట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.






ఆ ట్వీట్లో ప్రకాష్ రాజ్ పేర్కొంటూ.. "విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూడగలదు. నేను కేవలం కేరళ చాయ్ వాలా గురించి మాత్రమే పోస్ట్ పెట్టాను. మరి ట్రోలింగ్ చేసిన చాయ్ వాలా ఎవరు? జోక్ ని జోక్ లాగే చూడాలి. లేకపోతే అది మన పైనే అనుకోవాల్సి వస్తుంది. గ్రో అప్" అంటూ మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు. ఇక ట్విట్టర్ లో ట్రోలింగ్ చేసిన చాయ్ వాలా ఎవరు? అంటూ పరోక్షంగా మోడీపై సెటైర్లు పేల్చారు ప్రకాష్ రాజ్. తను చేసిన జోక్ ని సరిగ్గా అర్థం చేసుకోలేదని, అలా అర్థం చేసుకోలేని వారు అది తమపైనే అనుకుంటారని  తన ట్వీట్ తో ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.


కాగా 2017లో తన స్నేహితురాలు గౌరీ లంకేష్ హత్యకు గురైన తర్వాత ప్రకాష్ రాజ్ '#Just Asking' అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో సమాజానికి సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'చంద్రయాన్ 3' పై ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు 'చంద్రయాన్ 3' ఆగస్టు 23, 2023న చంద్రునిపై ల్యాండ్ కానుంది. చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ ను విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా ఇండియా అవతరిస్తుంది.


Also Read : చిరు ‘మెగా’ కాన్సెప్ట్ - పంచ భూతాలతో చిరంజీవి ప్రయోగం, 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోనర్‌లో!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial