Sai Dharam Tej: ప్రస్తుతం మెగా ఫ్యామిలీ వారసులంతా మంచి హిట్స్‌తో, మినిమమ్ గ్యారెంటీ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. తను హీరోగా డెబ్యూ ఇచ్చినప్పటి నుంచి మెగా మేనల్లుడు అంటూ ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే యూత్‌ఫుల్ కథలను ఎంచుకుంటూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చాడు సాయి ధరమ్ తేజ్. ‘రేయ్’ అనే మూవీతో ధరమ్ తేజ్ డెబ్యూ జరగాల్సింది. కానీ తాజాగా తాను డెబ్యూ అవ్వాల్సింది ఒక ప్రేమకథతో అంటూ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు ఈ మెగా మేనల్లుడు.


ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్..


ముందుగా ఒక దర్శకుడు ఒక హీరో దగ్గరకు వెళ్లి కథ వినిపించడం.. కానీ పలు కారణాల వల్ల వారి కాంబినేషన్‌లో మూవీ సెట్ అవ్వకపోవడం కామన్‌గా జరిగేదే. ఒకవేళ హీరోకు కథ నచ్చినా కూడా ఇతర కారణాల వల్ల కూడా ప్రాజెక్ట్స్ ఆగిపోవడం ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. సాయి ధరమ్ తేజ్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యిందని తాజాగా బయటపెట్టాడు. కే విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘ఉషా పరిణయం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు ఈ మెగా హీరో. అయితే విజయ భాస్కర్ దర్శకత్వంలోనే హీరోగా తన డెబ్యూ జరగాల్సింది అని వర్కవుట్ అవ్వకపోవడంతో వేరే హీరోతో ఆ మూవీ తీసి హిట్ కొట్టారని రివీల్ చేశాడు సాయి ధరమ్ తేజ్.


ఛాన్స్ మిస్..


ఆది హీరోగా నటించిన ‘ప్రేమ కావాలి’ మూవీలో ముందుగా తాను నటించాల్సిందని, హీరోగా తన డెబ్యూ విజయ భాస్కర్ దర్శకత్వంలో జరగాల్సింది అని ఈవెంట్‌లో బయటపెట్టారు సాయి ధరమ్ తేజ్. అతడి మూవీ వర్కవుట్ అవ్వకపోవడంతో సాయి కుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ ‘ప్రేమ కావాలి’ని తెరకెక్కించారు విజయ భాస్కర్. దీంతో ఆది.. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మైండ్‌లో రెజిస్టర్ అయ్యాడు. అదే సినిమా సాయి ధరమ్ తేజ్ చేసి ఉండుంటే తాను కూడా ఒక రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యేవాడు. కానీ చాలా కాంట్రవర్సీలు మధ్యలో హీరోగా డెబ్యూ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.


విడుదల వాయిదా..


డైరెక్టర్ వైవీఎస్ చౌదరీ ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్లను హీరోలుగా మార్చి వారికి లైఫ్ ఇచ్చాడు. అలాగే సాయి ధరమ్ తేజ్‌తో కూడా ‘రేయ్’ అనే మూవీని తెరకెక్కించారు. సినిమా షూటింగ్ పూర్తయినా కూడా చాలాకాలం వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. దీంతో మెగా మేనల్లుడు హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు అని ప్రేక్షకులు క్రియేట్ అయిన హైప్‌కు లాభం లేకుండా పోయింది. సరిగ్గా ఏడాది తర్వాత ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో వచ్చి క్లీన్ హిట్‌తో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత ఏడాదికి ‘రేయ్’ కూడా విడుదలయ్యింది. కానీ ఆ సినిమా గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. ప్రస్తుతం రోహిత్ అనే కొత్త దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తున్నాడు.


Also Read: అందుకే నా ఇన్‌స్టాగ్రామ్‌ డిలీట్‌ చేశా - అసలు విషయం చెప్పిన విశ్వక్‌ సేన్‌