పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'బ్రో'(BRO). మెగా మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.  తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది తెలుగు రీమేగా తెరకెక్కుతోంది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ పై, డైలాగ్స్ అందిస్తున్నారు. జి స్టూడియోస్ సంస్థతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందనను కనబరిచింది.


జూలై 28న విడుదల కాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. అయితే సాయి తేజ్ కి సంబంధించి కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా తాజాగా మూవీ టీం దాన్ని పూర్తి చేసింది. ఈ విషయాన్ని హీరో సాయి తేజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రీసెంట్ గా మూవీ టీమ్ ఓ సాంగ్ షూటింగ్ కోసం ఆస్ట్రియా కి వెళ్లగా.. తాజాగా సాంగ్ షూట్ ని మూవీ టీమ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. అంతేకాకుండా ఈ షూట్ తోనే మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు సాయి తేజ్ తెలిపారు. ఈ మేరకు సెట్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ పలు ఆసక్తికర పోస్టులు చేశారు.


"ఆస్ట్రియాలోని అత్యంత సుందరమైన ఇన్స్ బ్రక్ నగరంలో 'బ్రో' చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇలాంటి ఒక సుందరమైన ప్రాంతంలో షూటింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి థాంక్స్ అనే మాట ఒక చిన్న పదం మాత్రమే. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన షూటింగ్ అనుభవాన్ని అందించినందుకు మా యూనిట్ మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ సాయి తేజ రాసుకొచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ నుంచి సాయి తేజ షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ నెల చివర్లోనే బ్రో మూవీ రిలీజ్ ఉండగా మూవీ టీం ఇప్పుడు సినిమాకు సంబంధించి సాంగ్స్ విడుదల చేయనుంది.


ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే 'బ్రో' మూవీకి ఓవరాల్ బిజినెస్ రూ.100 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. కేవలం ఒక ఆంధ్ర ఏరియాలోనే ఈ సినిమాకి రూ.40 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ లోనూ రూ.13 కోట్ల రేంజ్ లో డీల్ క్లోజ్ అయిందని అంటున్నారు. ఒక రీమేక్ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. దీనికి పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణం అని స్పష్టంగా అర్థం అవుతుంది. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న 'బ్రో' మూవీ రేపు రిలీజ్ తర్వాత ఇంకెలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Also Read : ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిఖిల్ - కారణం అదేనా?