'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ తాజాగా 'స్పై' అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే సినిమా టాక్ గురించి పక్కన పెడితే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. విడుదలైన మొదటి రోజే సుమారు రూ.11 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మూవీ టీం అధికారికంగా తెలియజేసింది. దాంతో హీరో నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా 'స్పై' నిలిచింది.


కాగా రెండవ రోజు నుంచి ఈ సినిమా డీలా పడుతూ వచ్చింది. ముఖ్యంగా సినిమా కథనం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే నిఖిల్ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ కి తన ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నిఖిల్ తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ నోట్ ని రిలీజ్ చేస్తూ తన ఆవేదన వ్యక్తపరిచారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 'స్పై' అన్ని భాషల్లో రిలీజ్ కాకపోవడం గురించి కూడా ప్రస్తావిస్తూ.. అందుకు తాను చింతిస్తున్నానని, ఇకపై అలా జరగకుండా ఉండేలా చూసుకుంటానని వెల్లడించారు.


ఇక నిఖిల్ తాజాగా రిలీజ్ చేసిన స్పెషల్ నోట్ లో పేర్కొంటూ.. ‘‘స్పై సినిమాకి నా కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాపై మీరు ఇంత నమ్మకం ఉంచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాంటాక్ట్/కంటెట్ డిలే సమస్యల వల్ల ఈ సినిమాని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయలేకపోయాం. అది నన్ను ఎంతగానో బాధించింది. ఓవర్సీస్ లోనూ సుమారు 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. హిందీ, కన్నడ, తమిళ, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. తర్వాత రాబోయే మూడు సినిమాలు అన్ని భాషల్లోనూ థియేటర్స్ లో అనుకున్న సమయానికి విడుదల అవుతాయని నేను మాటిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి మాటిస్తున్నాను. ఇక నుంచి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడను. దానికి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా సరే, ఓ మంచి క్వాలిటీ ఉన్న సినిమాను మీకు అందిస్తాను" అంటూ నిఖిల్ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో నిఖిల్ రిలీజ్ చేసిన ఈ స్పెషల్ నోట్ వైరల్ అవుతుంది.


ఇక 'స్పై' విషయానికి వస్తే.. సుభాష్ చంద్రబోస్, మర్డర్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని ఎడిటర్ గ్యారీ బిహెచ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి, చరణ్ ఉప్పలపాటి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించగా.. సానియా ఠాకూర్, ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమటం ఇతర కీలకపాత్రలు పోషించారు. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని దర్శకుడు గ్యారీ బిహెచ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఎంచుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, దాన్ని నడిపించిన తీరు రొటీన్ గా ఉండడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం 'స్పై' పర్వాలేదనిపించింది.