RRR Re Release In 3D: ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ఎన్నో ఇతర భాషా పరిశ్రమల్లో కూడా రీ రిలీజ్‌లు ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఒకప్పుడు సూపర్ హిట్ అయ్యి, క్లాసిక్‌గా నిలిచిపోయిన చిత్రాలు మాత్రమే కాకుండా ఆఖరికి ఫ్లాప్ అయిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేసి కలెక్షన్స్‌ను వెనకేసుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఈ రి రిలీజ్‌ల లిస్ట్‌లోకి ఇండియన్ ప్రైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఒకటి యాడ్ అవ్వనుంది. అదే ‘RRR’. 2022లో విడుదలయిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి 3డీ ఫార్మాట్‌లో ప్రేక్షకులను అలరించనుంది.


ఫ్యాన్స్ ఖుషీ..


2022 మార్చి 25న ‘RRR’ విడుదలయ్యి ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘బాహుబలి’తో దర్శక ధీరుడిగా మారిన రాజమౌళి తరువాతి సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి ఫ్యాన్స్ అంతా తృప్తిపడేలా ‘RRR’ను తెరకెక్కించారు జక్కన్న. ఇక ఈ మూవీ విడుదలయ్యి రెండేళ్లు అయిపోయిన తర్వాత 3డీ ఫార్మాట్‌లో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘RRR’ రీ రిలీజ్ గురించి పెన్ మూవీస్, పీవీఆర్ సినిమా కలిసి అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం ‘RRR’ రీ రిలీజ్ గురించి తెలిసి రామ్ చరణ్, ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఇద్దరు సిద్ధమయ్యారు..


మే 10న ‘RRR’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రీ రిలీజ్ కానుందని పెన్ మూవీస్ ప్రకటించింది. ‘వాళ్ల అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో, స్టెప్పులతో మిమ్మల్ని ఉర్రూతలూగించడానికి ఈ ఇద్దరు సిద్ధమయ్యారు’ అంటూ ‘RRR’ రీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈసారి రీ రిలీజ్ అనేది అన్ని భాషల్లో కాకుండా కేవలం తెలుగు, హిందీలో మాత్రమే అని పేర్కొంది. మేలో ఎక్కువగా సినిమాలు పోటీ లేకపోవడంతో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కోసం మరోసారి ‘RRR’ను థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






తెలుగు పాటకు ఆస్కార్..


రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’.. ఏకంగా రూ.550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించడంతో పాటు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఆస్కార్స్ చరిత్రలోనే ఇప్పటివరకు ఒక్క తెలుగు పాటకు కూడా అవార్డ్ దక్కలేదు. అలాంటి ‘RRR’లో కీరవాణి కంపోజ్ చేసి, చంద్రబోస్ రాసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వరించడం ప్రతీ ఒక్క తెలుగు ప్రేక్షకుడిని గర్వంగా ఫీల్ అయ్యేలా చేసింది. ఇప్పటికీ ‘నాటు నాటు’ పాట అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల ప్రేక్షకులను అలరిస్తోంది.



Also Read: థియేటర్లు డల్, ఓటీటీలు ఫుల్ - ఒకే వారంలో 17 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్