రాంగోపాల్ వర్మ 'వ్యూహం' ట్రైలర్ తాజాగా విడుదలైంది. వైఎస్ జగన్ పాదయాత్ర నుంచి మొదలుకొని రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్న పరిణామాలు అన్నిటిని ఈ ట్రైలర్లో చూపించారు. దాంతోపాటు రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కూడా ట్రైలర్లో ప్రస్తావించడం అందరినీ షాక్ కి కూడా చేసింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా 'వ్యూహం' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.


వైయస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 2024 ఎలక్షన్స్ ని టార్గెట్ చేసుకొని వైసీపీకి పొలిటికల్ క్యాంపెనింగ్ కోసమే ఈ సినిమా తీశారని ఇదివరకు విడుదల చేసిన టీజర్ తోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. రాంగోపాల్ వర్మ ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి టీడీపీని టార్గెట్ చేసి ట్వీట్స్ చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన 'వ్యూహం' ట్రైలర్ ని గమనిస్తే.. 2009 నుండి జగన్ పాదయాత్ర మొదలుపెట్టి కాంగ్రెస్ హై కమాండ్ ని ఎదిరించి బయటికి వచ్చిన దగ్గర నుండి నెలకొన్న నాటకీయ పరిణామాలు అన్నిటినీ సినిమాలో చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.






అప్పటి సంఘటనల నుండి రీసెంట్ గా చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కూడా ఈ ట్రైలర్ లో ప్రస్తావించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా వర్మ డైరెక్ట్ గా టార్గెట్ చేశాడు. 2019 ఎలక్షన్ సమయంలో జగన్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని యథావిధిగా ఈ సినిమాలో వాడేసాడు. ముందుగా అందరూ ఊహించినట్టుగానే చంద్రబాబులోని కన్నింగ్ యాంగిల్ ని వ్యూహం సినిమాలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా వైయస్ జగన్ ని హైలెట్ చేస్తూ టీడీపీ, జనసేన ను టార్గెట్ చేసి వ్యూహం సినిమాను తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన టీడీపీ, జనసేన మీద కూడా ఈ సినిమా ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశముంది.


మరి ఈ సినిమా చూశాక టీడీపీ, జనసేన పార్టీల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయా? లేదా అనేది చూడాలి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈసారి ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జనసేన, టీడీపీ కలిసి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కానీ తాజాగా విడుదలైన 'వ్యూహం' ట్రైలర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. కాగా వైయస్ జగన్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ మొదటి భాగానికి 'వ్యూహం' అనే టైటిల్ ఖరారు చేయగా, రెండో భాగానికి 'శపథం' అనే టైటిల్ పెట్టారు. వీటిలో 'వ్యూహం' నవంబర్ 10న విడుదల కానుండగా వచ్చే ఏడాది జనవరిలో 'శపథం'(వ్యూహం 2) రిలీజ్ కానుంది.


Also Read : తెలుగులో రీమేక్ కాబోతున్న 'ఓ మై గాడ్ 2' - శివుడి పాత్రలో సీనియర్ హీరో?






Join Us on Telegram: https://t.me/abpdesamofficial