Ram Charan : జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొననున్నారు. అందుకోసం ఇప్పటికే ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. ఈ సమ్మిట్ కు హాజరైన అనంతరం టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ లో ఆయన అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీ అవుతారు. కాగా వివిధ దేశాల నుంచి వచ్చిన సెలబ్రెటీలు, ప్రముఖులు ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. జమ్మూకశ్మీర్ లో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలపై చర్చ జరగనుందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. మన దేశంలో టూరిజం పరంగా ముఖ్యమైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో సినిమా షూటింగ్ ల కోసం సింగిల్ విండోను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా ఈ సదస్సుకు ధర్మం, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.


కట్టుదిట్టమైన సాయుధ దళాల సెక్యూరిటీ మధ్య జీ 20 సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు G20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ సదస్సుకు మెగా హీరో రామ్ చరణ్ కూడా హాజరు కానుండడంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఆయనకు దక్కిన ఈ అరుదైన గౌరవాన్ని కొనియాడుతున్నారు. 


కశ్మీర్ అందాలను వీక్షించనున్న అతిథులు  


ఇదిలా ఉండగా.. జీ 20 సదస్సుకు ఇప్పటికే ఫిల్మ్ టూరిజం పాలసీపై జరిగే చర్చలో ధర్మ, నెట్‌ఫ్లిక్స్, ఫిక్కీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో విచ్చేసిన ప్రతినిధులు సింగపూర్ నుంచి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. సమ్మిట్ చివరి రోజున ప్రతినిధులంతా శ్రీనగర్ లోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శిస్తారు. ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం , ఫిల్మ్ టూరిజం పాలసీ అవకాశాలపై ప్రత్యేక సెషన్‌లు కూడా జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాగనున్న ఈ సదస్సులో చివరి రోజున  అతిథులందరూ పోలో వ్యూ, జీలం రివర్ ఫ్రంట్ , శ్రీనగర్ నగర్ లోని ఇతర ప్రదేశాలను కూడా సందర్శించనున్నారు.


ఇదే తొలిసారి..


మరో ముఖ్య విషయమేమిటంటే.. 2019వ సంవత్సరం ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ప్రాంతంలో అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి కావడం చెప్పుకోదగిన విషయం. పాకిస్థాన్ ఈ సదస్సును బహిష్కరిస్తున్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసినప్పటికీ అనేక దేశాల ప్రతినిధులు మాత్రం ఈ మూడు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. అయితే చైనా, టర్కీ , సౌదీ అరేబియా దేశాలు మాత్రమే ఈ సదస్సుకు దూరంగా ఉన్నాయి.


ఇటీవల హైదరాబాద్ లో జరిగిన నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లోనూ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన నుంచే నేర్చుకున్నానని, ఆయన కలను సజీవంగా ఉంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.


Read Also : 'ఇండియన్ ఐడల్ సీజన్ - 2'కు ఐకానిక్ గెస్ట్ జడ్జ్