టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. త్వరలోనే ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యను సిద్దార్థ్ వివాహం చేసుకోనున్నారు. సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ప్రస్తుతం అక్కడే ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యాడు.. తాజాగా సిద్దార్థ్ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో కమెడియన్ ఆలీ,  రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త సుబ్బిరామిరెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.


త్వరలో ఘనంగా సిద్దార్థ్, ఐశ్వర్య వివాహం


బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో గౌతమ్ పెద్దవాడు కాగా, సిద్దార్థ్ చిన్నవాడు. గౌతమ్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2004 జూలై 30న విడుదలైన ఈ సినిమాను శ్రీ వరసిద్ధి వినాయక ఫిల్మ్స్ పతాకంపై సుంకర మధు మురళి, దేవినేని ప్రసాద్ లు నిర్మించారు. ఈ సినిమాకు కె.సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వం వహించారు. రతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించారు. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమా రంగంలో నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో పెళ్లి చేసుకుని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు.  బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్ధార్థ్ విదేశాలలో చదువుకున్నాడు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అతడి గురించి చాలా మందికి తెలియదు. సిద్ధార్థ్ కు సినిమాల పైన పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. తాజాగా అతడి పెళ్లి జరుపుతున్నారు. సిద్ధార్థ్-ఐశ్వర్య వివాహం త్వరలోనే జరగబోతోంది. ఈ వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు  బ్రహ్మానందం  ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.


రంగమార్తాండ’లో అద్భుత నటన కనబర్చిన బ్రహ్మానందం


బ్రహ్మానందం సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఆరోగ్య కారణాలతో ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నారు. చివరిగా రంగమార్తాండ సినిమాలో నటించారు.  సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ నటించిన 'రంగమార్తాండ' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మార్చి 22న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది.    ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా సినిమాలు తీసే డైరెక్టర్ కృష్ణ వంశీ  'రంగమార్తాండ'ను అద్భుతంగా చిత్రీకరించారు. మనసుకు హత్తుకునేలా, థియేటర్‌లలో నుంచి బరువైన గుండెలతో బయటకు వచ్చేలా, ఎమోషన్‌లా కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. మారాఠి సినిమా 'నటసామ్రాట్‌'కు రీమేక్‌గా తెరకెక్కిన 'రంగమార్తాండ' సినిమా ఇప్పటివరకు సినీ ప్రేక్షకులనే కాదు, మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులనూ కంటితడి పెట్టించింది. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు.. మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం మరో విశేషం. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఇండియన్ వైడ్ ట్రెండ్రింగ్ లో నిలిచింది. యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉన్న 'టాప్ 10 మూవీస్'లో మొదటి స్థానంలో నిలిచింది. 


Read Also: విక్రమ్ తో సినిమా చేయాలనుకున్నా, స్పందించకపోవడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నా- అనురాగ్ కశ్యప్