'ఒక ఊరిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రమేష్ వర్మ.. 'రైడ్' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తెరకెక్కించిన 'వీర' 'అబ్బాయితో అమ్మాయి' చిత్రాలతో ప్లాప్స్ మూటగట్టుకున్నాడు. దీంతో ఈసారి చాలా గ్యాప్ తీసుకొని 'రాక్షసుడు' రీమేక్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు.. మాస్ మహారాజా రవితేజ హీరోగా 'ఖిలాడీ' సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ చిత్రం ప్లాప్ అవడంతో దర్శకుడు సైలెంట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి 'శివోహం' అనే సినిమా ప్రకటనతో వచ్చి వార్తల్లో నిలిచాడు. 


ఈరోజు (ఆగస్టు 22) డైరెక్టర్ రమేష్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా 'శివోహం' చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞాన‌వేల్ రాజా ఈ సినిమాని నిర్మించనున్నారు. ''మిస్టీరియస్ సాగాను అన్‌లాక్ చేస్తోంది.. రహస్య నిధి కోసం ఒక దుర్మార్గపు డెవిల్ చేసే యుద్ధమే ఈ శివోహం'' అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. 'అద్భుతమైన నటీనటులు సాంకేతిక నిపుణులతో అద్భుతమైన విజువల్ ఎక్స్‌ట్రావాగాంజాను చూసేందుకు సిద్ధంగా ఉండండి' అని పేర్కొంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను వదిలారు. 


'శివోహం' అనేది ట్రెజర్ హంట్ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కనున్న హారర్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. డిజైన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో టెక్నికల్ టీమ్ ని ప్రకటించిన మేకర్స్.. హీరో హీరోయిన్లు ఎవరనేది వెల్లడించలేదు. దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మరియు లిరిసిస్ట్ శ్రీమణి ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. ఈ చిత్రానికి శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్ గా, మిలన్ ఫెర్నాండెజ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. అలానే మధుర శ్రీధర్ రెడ్డి, జి. ధనంజయన్ లు నిర్మాణంలో భాగస్వామ్యులుగా ఉన్నారు. 






నిజానికి 'ఖిలాడీ' నిర్మాణ దశలో ఉన్నప్పుడే కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో 'రాక్షసుడు 2' చిత్రాన్ని అనౌన్స్ చేసారు రమేష్ వర్మ. హవిష్ ప్రొడక్షన్‌ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తీయనున్నట్లు ప్రకటించారు. మొదటి భాగం కంటే కథ చాలా ఎగ్జైటింగ్ గా వచ్చిందని, 100 కోట్ల బడ్జెట్‌ తో హాలీవుడ్ మూవీ రేంజ్ లో తెరకెక్కిస్తామని.. పూర్తిగా లండన్‌ లో చిత్రీకరించబడుతుందని తెలిపారు. గిబ్రాన్ ను సంగీతం దర్శకుడిగా.. వెంకట్ సి దిలీప్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నామని.. సాగర్ - శ్రీకాంత్ విస్సా కలిసి డైలాగ్స్ రాస్తున్నారని పోస్టర్ ద్వారా తెలియజేసారు. అంతేకాదు ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తారని చెప్పారు. అయితే ఏమైందో ఏమో 'ఖిలాడీ' ప్లాప్ తర్వాత 'రాక్షసుడు 2' ప్రాజెక్ట్ ఊసే లేకుండా పోయింది. ఇన్నాళ్లకు ఇప్పుడు 'శివోహం' అనే పవర్ ఫుల్ టైటిల్ తో సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు రమేష్. 


ఇదిలా ఉంటే హిందీలో హిట్టైన ‘భూల్ భులాయా 2’ సినిమా రీమేక్ రైట్స్ ను నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్టోరీతోనే ర‌మేష్ వ‌ర్మ 'శివోహం' సినిమా తీస్తున్నార‌ని టాక్ నడుస్తోంది. కేవలం కోర్ పాయింట్ ని మాత్ర‌మే తీసుకొని, పూర్తిగా కొత్త బ్యాక్ డ్రాప్ లో, కొత్త పాత్ర‌లు సృష్టించి ఈ క‌థ‌ని డిజైన్ చేస్తున్నారట. ‘రాక్ష‌సుడు’ లో నటించిన బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌ నే ఈ సినిమా కోసం హీరోగా పరిశీలిస్తున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. 


Also Read: MEGA156 - మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా చిరంజీవి 'మెగా రాకింగ్' ఎంటర్టైనర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial