Rajeev Kanakala About Trolling on Vijay Devarakonda & Nivedha Thomas: ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో జ‌రుగుతున్న ట్రోలింగ్ పై యాక్ట‌ర్ రాజీవ్ క‌న‌కాల స్పందించారు. ట్రోలింగ్ మ‌రీ ఎక్కువ అయ్యింద‌ని ఆయ‌న అన్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఫ్యామిలీ స్టార్ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, ఎందుకు నెగ‌టివ్ ప్ర‌చారం చేశారో త‌న‌కు అర్థం కాలేదు అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కొన్ని సినిమాల‌పై చేసే ట్రోలింగ్ వ‌ల్ల ప్రొడ్యూస‌ర్లు న‌ష్ట‌పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాజీవ్. 


కంట్రోల్ చేయాల‌ని అనుకోవ‌డం లేదు


సోష‌ల్ మీడియాలో ప్ర‌తి ఒక్క‌రినీ తాము కంట్రోల్ చేయాల‌ని అనుకోవ‌డం లేదు అని అన్నారు రాజీవ్ క‌న‌కాల‌. పెట్టే పోస్ట్ లు, ట్రోలింగ్ చేసే ముందు ఆలోచించాల‌ని ఆయ‌న సూచించారు. స్థాయిని త‌గ్గించాల‌ని అన్నారు. ట్రోలింగ్ అనే బాంబులు కానీ, అస్త్రాలు కానీ ఒకేసారి బ్ర‌హ్మాస్త్రాలుగా వాడొద్ద‌ని,  ట్రోల్ చేసే స్థాయిని త‌గ్గించాల‌ని అన్నారు. డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్స్‌ను కూడా కంట్రోల్ చేయాలి అని కాద‌ని, ప్రెస్ మీట్ పెట్టి కూడా బ్ర‌ద‌ర్ మీరు ఎవ‌రైనా గ‌తంలో ఇబ్బందిక‌ర పోస్ట్ లు, వీడియోలు పెట్టుంటే తీసేయండి అని చెప్పామ‌ని, శివ‌బాలాజీ కూడా చెప్పింది అదే అని క్లారిటీ ఇచ్చారు రాజీవ్ క‌న‌కాల‌.


ఫ్యామిలీ స్టార్ న‌చ్చింది.. ఎందుకు ట్రోల్ చేశారో!


హీరోల‌పై చేసే ట్రోలింగ్ వ‌ల్ల ప్రొడ్యూస‌ర్లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని అన్నారు రాజీవ్ క‌న‌కాల‌. "విజ‌య్ దేవ‌ర‌కొండ మీద ఆ మ‌ధ్య‌లో ట్రోలింగ్ జ‌రిగింది. ఫ్యామిలీ స్టార్ సినిమాకి ముందు. ఎందుకు జ‌రిగిందో తెలీదు. అంత‌కుముందు విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు చూడ‌లేదు నేను. ‘ఖుషి’ ఇంట‌ర్వ్యూ చూశాను. ఆ త‌ర్వాత థియేట‌ర్ లో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకి వెళ్లాను. నాకు సినిమా న‌చ్చింది. వీళ్లు చేసిన ట్రోలింగ్‌కు, వీళ్లు ఇచ్చిన బ్యాడ్ కామెంట్స్‌కు అది మూడు, నాలుగు రోజుల కూడా ఆడ‌లేదు. అలా ఎందుకు చేశారో నాకు తెలీదు. కార‌ణాలు ఏదైనా ప్రొడ్యూస‌ర్‌కు దెబ్బ ప‌డుతుంది. ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్లు ప్రొడ్యూస‌ర్ ని కింద‌కి లాగేస్తున్నారు. కొన్ని కోట్లు రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన ప్రొడ్యూస‌ర్ ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాడు. హీరోలు కూడా ఒక్కోసారి జాగ్ర‌త్త ప‌డాలి. వాళ్ల ఫ్యాన్స్ కూడా జాగ్ర‌త్త ప‌డాలి. అంద‌రూ ఆలోచించుకోవాలి. అంద‌రి గురించి ఆలోచించాలి". 


ప్రెస్ మీట్ ల‌లో కూడా.. 


"ఈ మ‌ధ్య కాలంలో జ‌రుగుతున్న ప్రెస్ మీట్స్ లో కొన్ని ప్ర‌శ్న‌ల వ‌ర‌కు బాగానే ఉంటున్నాయి. కొన్ని మాత్రం శృతి మించిపోతున్నాయి. ఇప్పుడింకా కెమెరాలు ఉంటున్నాయి కాబ‌ట్టి కొంచెం త‌గ్గింది. గ‌తంలో చాలా ఘాటుగా కూడా అడిగేవాళ్లు. ఇప్పుడు అన్నీ శృతిమించి అడుగుతున్నారు. తిక‌మ‌క‌గా కూడా అడుగుతున్నారు. అది కొంచెం త‌గ్గించుకుంటే మంచిది. సినిమా ఏంటి? టైటిల్ ఏంటి? హీరో ఏంటి? అని అడిగితే స‌రిపోతుంది. ఈ మ‌ధ్య ఒక ప్రెస్ మీట్ చూశాను. ఎవ్వ‌రినీ బాధ‌పెట్టాల‌ని ఈ ఉదాహ‌ర‌ణ చెప్ప‌డం లేదు. ఈ మ‌ధ్య ఒక ప్రెస్ మీట్ లో నివేద థామ‌స్‌ను మీరు ఎందుకు ఇంత లావు అయ్యారు? అని అడిగారు. ఆమె చాలా సుతిమెత్తంగా చాలా గౌర‌వ ప్ర‌దంగా ఇది సినిమాకి సంబంధించిన విష‌యం కాదు అని చెప్పారు. అంటే మ‌నం ఇదివ‌ర‌కు అడిగే స్టైల్, ఇప్పుడు అడుగుతున్న స్టైల్ మారిపోయింది అని చెప్ప‌డానికి ప్ర‌స్తావించాను. అంతేకాని ఏ పాత్రికేయుడిని బాధ‌పెట్టాలి అని మాత్రం కాదు’’ అని అన్నారు.


Also Read: 'కల్కి 2898 ఏడీ' కోసం నాలుగేళ్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం - అశ్వద్దామకు అమితాబ్‌ని తప్ప మరొకరిని ఊహించుకోలేదు..