Rajamouli about Japan Earth Quake ప్రపంచమంతా హ్యాపీగా న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్తున్న సమయంలో జపాన్‌లో భూకంపం అనే వార్త.. అందరినీ ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. పైగా భూకంపమే కదా అని తేలిగ్గా తీసుకునేలా కాకుండా చాలా తీవ్రమైన భూకంపం సంభవించడంతో అక్కడ ఇళ్లు కూలిపోయాయి, చాలామంది ప్రజలు మరణించారు కూడా. అయితే ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు జపాన్ పట్ల తమ సానుభూతిని తెలియజేశారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా జపాన్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేస్తూ.. ఆ దేశమంటే తనకు ఎంత ఇష్టమో బయటపెట్టారు.


దానిగురించే ఆలోచన..
‘‘జపాన్‌ను భూకంపాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూసి చాలా కలవరంగా ఉంది. ఈ దేశానికి మన అందరి మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనివల్ల అక్కడి ప్రజల జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయో అనే విషయంపైనే నా ఆలోచనలు ఉన్నాయి’’ అంటూ జపాన్ భూకంపాల విషయంపై ట్వీట్ చేశారు రాజమౌళి. జపనీస్ భాషలో ‘గుడ్ లక్ జపాన్’ అని పేర్కొన్నారు. జపనీస్ భాషలో ఇక ఎన్‌టీఆర్ సైతం వారం రోజులు జపాన్‌లోనే ఉన్నానని, అక్కడే షూటింగ్ చేశానని, ఇంటికి రాగానే ఈ వార్త వినాల్సి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరెందరో సెలబ్రిటీలు కూడా జపాన్ ధైర్యంగా ఉండాలని చెప్తూ.. అక్కడ మరణించిన వారికి సంతాపం తెలియజేస్తున్నారు.






షూటింగ్స్ కోసం మొదటి ప్రాధాన్యత జపాన్‌కే..
సినిమా షూటింగ్స్‌కు లొకేషన్స్ ఎంపిక చేసే సమయంలో ఆ లిస్ట్‌లో కచ్చితంగా జపాన్ పేరు ఉంటుంది. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు కూడా ఆ దేశంలో చిత్రీకరణను జరుపుకున్నాయి. రాజమౌళి సైతం తన సినిమాల్లో అక్కడి లొకేషన్స్‌ను ఉపయోగించుకున్నారు. ఇక అలాంటి అందమైన దేశాన్ని భూకంపాలు అతలాకుతలం చేస్తుండడంతో చాలామంది ఆ దేశంపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అక్కడి తీవ్రత ఏంటో ఇతరులకు తెలిసేలా చేస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు అయితే చాలా భయంకరంగా.. చూసేవారినే భయపెడుతున్నాయి. అలాంటి తీవ్రత మధ్య అసలు ప్రజలు ఎలా బ్రతుకుతున్నారని మిగతా దేశాల ప్రజలు వాపోతున్నారు. జపాన్‌లోని సహాయక బృందాలు కుదిరినంత అందరికీ సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి.


తీవ్రమైన భూకంపం..
జపాన్ భూకంపం విషయానికి వస్తే... రిక్టర్‌ స్కేల్‌పై తీవ్ర 7.4గా నమోదైంది. సెంట్రల్ జపాన్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. Japan Meteorological Agency వెల్లడించిన వివరాల ప్రకారం..పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరప్రాంతాలను అప్రమత్తం చేశారు. 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నీగట, తొయామా, ఇషికావా ప్రాంత ప్రజలకు అలెర్ట్ జారీ చేశారు. వాజిమా నగర తీరాన్ని మీటర్ కన్నా ఎక్కువ ఎత్తైన అలలు వచ్చి తాకే ప్రమాదముంది. ప్రస్తుతానికి ప్రాణ,ఆస్తి నష్టాల వివరాలు వెల్లడి కాలేదు. కానీ భూకంపాల వల్ల కూలిపోయిన భవనాల కింద చాలామంది ప్రాణాలు చిక్కుకుపోయి ఉన్నాయని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా ఈ విషయంపై అధికారికంగా స్టేట్‌మెంట్ ఇవ్వడానికి జపాన్ ప్రభుత్వం ముందుకు రాలేదు.


Also Read: గుండె తరుక్కుపోతోంది, జపాన్ ప్రజలూ ధైర్యంగా ఉండండి - ఎన్టీఆర్