Rajamouli Son karthikeya Tweet About Japan earthquake: ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి జపాన్ పర్యటనలో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చాలాకాలం బ్రేక్ తీసుకున్న జక్కన్న.. ప్రస్తుతం మహేశ్‌ బాబుతో చేయనున్న మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనికోసమే ఆయన జపాన్ వెళ్లారు. తనతో పాటు తన కుమారుడు కార్తికేయ కూడా జపాన్ పర్యటనలో భాగమయ్యాడు. అయితే తాజాగా అక్కడ భూమి కంపించింది. ఈ భూకంపాన్ని రాజమౌళితో పాటు తన కుమారుడు కార్తికేయ ఎక్స్‌పీరియన్స్ చేశాడు. జపాన్‌లో భూకంపం విషయాన్ని కార్తికేయ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం తను షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.


వారిలో కదలిక లేదు..


భూకంపం వచ్చినా భయపడకపోగా.. సోషల్ మీడియాలో దీనిపై ఫన్నీగా పోస్ట్‌ను షేర్ చేశాడు కార్తికేయ. ‘‘జపాన్‌లో ఇప్పుడే ఒక భూకంపాన్ని ఫీల్ అయ్యాం. మేము 28వ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు భూమి మెల్లగా కదిలినట్టుగా అనిపించింది. అది భూకంపం అని తెలుసుకోవడానికి మాకు కాస్త సమయం పట్టింది. నాలో భయం మొదలయ్యింది కానీ నా చుట్టూ జపాన్ ప్రజల్లో ఏ మాత్రం కదలిక లేదు. వారు దీనిని వర్షం పడుతుంది అన్నట్టుగా తీసిపారేశారు. భూకంపాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్న కోరిక తీరింది’’ అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. దాంతో పాటు జపాన్ మెటియోరోలాజిక్ ఏజెన్సీ నుంచి తన స్మార్ట్ వాచ్‌కు వచ్చిన అలర్ట్‌ను ఫోటో తీసి షేర్ చేశాడు కార్తికేయ.






స్మార్ట్ వాచ్‌కు అలర్ట్..


‘‘భూకంపానికి ముందస్తు హెచ్చరిక - భూమి బలంగా కంపించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండండి. దగ్గర్లో ఎక్కడైనా ఆగడానికి ప్రయత్నించండి’’ అంటూ జపాన్ మెటియోరోలాజిక్ ఏజెన్సీ నుంచి కార్తికేయ స్మార్ట్ వాచ్‌కు హెచ్చరిక వచ్చింది. ఇక జపాన్‌లోని భూకంపం విషయానికొస్తే.. దీని తీవ్రత 5.3గా నమోదయ్యింది. తూర్పు జపాన్‌లోని ఒక ప్రాంతంలో 45 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని తెలుస్తోంది. జపాన్‌లో ఈమధ్య ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలకు ఇది బాగా అలవాటు అయిపోయింది అన్నట్టుగా కార్తికేయ.. తన పోస్ట్‌లో తెలిపాడు.


ఘన స్వాగతం..


ఇటీవల జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ రీ రిలీజ్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహూబలి’తోనే జపాన్‌లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రాజమౌళి. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకుల ముందుకు రావడంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు కూడా ఫిదా అయ్యారు. అందుకే రీ రిలీజ్‌ను కూడా భారీ ఎత్తులో ప్లాన్ చేశారు. అందుకే తాజాగా కుటుంబంతో సహా జపాన్‌కు వెళ్లిన రాజమౌళికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఒక 83 ఏళ్ల వృద్ధురాలు తమకు స్వాగతం చెప్పిన తీరుకు రాజమౌళి ఫిదా అయ్యి పోస్ట్ కూడా చేశారు. అక్కడే మహేశ్ బాబుతో చేస్తున్న మూవీపై అప్డేట్ కూడా ఇచ్చారు జక్కన్న.


Also Read: ఆ సినిమా షూటింగ్ సమయంలో బాత్రూమ్స్ లేవు, అలా చేయాల్సి వచ్చింది - ప్రియమణి