Rajamouli Plans New Schedule At Kenya For SSMB29 Movie: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో 'SSMB29' మూవీపై మరో క్రేజీ న్యూస్ తాజాగా చక్కర్లు కొడుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి హైప్ మామూలుగా లేదు. ఈ ప్రాజెక్ట్ కొత్త షెడ్యూల్ షూటింగ్ కెన్యాలో జరగనున్నట్లు తెలుస్తోంది.

కొత్త షెడ్యూల్ ఎప్పటి నుంచంటే?

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కొత్త షెడ్యూల్ కెన్యాలో జులై రెండో వారంలో ప్రారంభం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీని కోసం రాజమౌళి సహా మూవీ టీం అక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు మహేష్ బాబుపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజ్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లపై కూడా కీలక సీన్స్ షూటింగ్ చేసే ఛాన్స్ ఉంది. పృథ్వీరాజ్ ఇందులో నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారనే ప్రచారం ఉంది.

కెన్యాలోని అటవీ ప్రాంతంలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారట జక్కన్న. ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్‌లోనూ షూటింగ్ చేయబోతున్నారని.. ఇప్పటికే కావాల్సిన అన్నీ అనుమతులు మూవీ టీంకు లభించాయని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ఒడిశాలోని సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్ సీల్, బాల్డ ప్రాంతాల్లో కీలక సీన్స్ షూట్ చేశారు. వెకేషన్ ట్రిప్ తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మూవీలోకి ఆర్ మాధవన్?

ఈ కొత్త షెడ్యూల్‌లోనే కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ మూవీలో జాయిన్ కానున్నారని తెలుస్తోంది. అలాగే, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పని చేయనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో భారీ స్టంట్స్ వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మూవీ టీం త్వరలోనే కెన్యా పయనం కానుంది.

Also Read: థ్రిల్లింగ్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

స్టోరీ అదేనా?

ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి? అనే దానిపై అందరిలోనూ ఎంతో ఆసక్తి ఉంది. ఆఫ్రికన్ అడవులు, సాహస యాత్ర నేపథ్యంలో సినిమా సాగుతుందనే ప్రచారం ఉంది. ఈ సినిమా రామాయణంలోని 'సంజీవని' సెంటర్ పాయింట్‌గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాంటింగ్ జోనర్ తరహాలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇంతకు ముందు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీని ప్రకారం మహేష్.. సంజీవని వేటలోనే సాహస యాత్ర చేపడతారనే.. అదే ఈ మూవీ స్టోరీ అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది.

ఈ సినిమాలో లార్జర్ దేన్ లైఫ్ అన్నట్లు హాలీవుడ్ రేంజ్‌లో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారట జక్కన్న. మహేష్ బాబును డైనోసార్స్ ఛేజ్ చేస్తాయని.. ఆ విజువల్ వండర్ సీన్ వేరే లెవల్‌లో ఉంటుందని అప్పట్లో ఓ టాక్ వినిపించింది. అయితే.. ఈ మూవీపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సోషల్ మీడియాలో సన్నిహత వర్గాల సమాచారం అంటూ రూమర్స్ తప్ప ఎలాంటి వాటిపై క్లారిటీ లేదు. ఏ సమాచారం కూడా లీక్ కాకుండా దర్శక ధీరుడు పక్కా ప్లాన్‌తో అలర్ట్‌గా ఉంటున్నారు.

దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా.. 2027లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.