Puri Jagannath Vijay Sethupathi New Movie: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath).. ఒకప్పుడు మాస్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా టాప్ హీరోలతో మంచి హిట్స్ అందించారు. మహేష్ 'పోకిరి' నుంచి ఎన్టీఆర్ 'టెంపర్' వరకూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్లాయి. ఇటీవల ఆయన సక్సెస్‌కు కాస్త బ్రేక్ పడిందనే చెప్పాలి. ట్రెండ్‌కు అనుగుణంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించినా అవి అంతగా విజయం సాధించలేదు. 


తమిళ స్టార్ హీరోతో..


మళ్లీ తన ట్రాక్ పట్టాలెక్కించే క్రమంలో పూరీ జగన్నాథ్ ప్రయత్నాలు చేస్తుండగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఆయన చెప్పిన ఓ కథకు ఓకే చెప్పారని తెలుస్తోంది. పూరీ చెప్పిన స్టోరీని ఆయన సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశారని.. తాను చేసిన సినిమాల్ని కూడా పక్కన పెట్టి కాల్‌షీట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ స్టోరీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ కాంబో.. ఊహించని స్టోరీ ఇక హిట్ ఖాయమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...


వరుస రూమర్స్..


తన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత వరుస అపజయాలు మూటగట్టుకున్నారు. 2019లో 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మళ్లీ హిట్ అందుకున్నారు. దీంతో పూరీ మళ్లీ ట్రాక్ ఎక్కేసినట్లేనని అభిమానులు ఫీల్ అయ్యారు. అయితే, విజయ్ దేవరకొండతో చేసిన లైగర్, రామ్‌తో చేసిన 'డబుల్ ఇస్మార్ట్' అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సందిగ్ధంలో పడ్డారు. దీంతో గత కొద్ది రోజులుగా సరైన హిట్, మంచి స్టోరీ కోసం చూస్తున్నారు.


ఇక కింగ్ నాగార్జునతో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. అలాగే, గోపీచంద్‌తో 'గోలీమార్' సీక్వెల్‌పైనా క్రేజీ రూమర్స్ చాలానే వినిపించాయి. అయితే అవేవీ పట్టాలెక్కలేదు. ఇప్పుట్లో పూరీ మూవీ ఉండదనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్టోరీకి తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఓకే చెప్పారనే ప్రచారంపై పూరీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాఫియా, డ్రగ్స్ వంటి రెగ్యులర్ బ్యాక్ డ్రాప్ కాకుండా క్రైమ్‌‍తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.


వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బిజీ బిజీ..


అయితే, ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఇటీవలే 'మహారాజా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. చివరగా 'విడుదల పార్ట్ 2' సినిమాలోనూ మెప్పించారు. మరి పూరీ స్టైల్ ఆఫ్ ఎలివేషన్స్‌లో విజయ్ సేతుపతి మూవీ ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఉప్పెన తర్వాత ఆయన్ను ఒప్పించేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ చాలా మంది కలిసినా విజయ్ సేతుపతి ఓకే చెప్పనట్లు తెలుస్తోంది.