Natti Kumar Letter to Censor Board: లోక్‌సభ ఎన్నికల తర్వాతే తెలుగు రాజకీయ కథా చిత్రం 'యాత్ర-2' సెన్సార్‌కు పంపించాలని ప్రముఖ నిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌ నట్టి కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్, సీఈఓ, హైదరాబాద్ రీజినల్ సెన్సార్ ఆఫీసర్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ పార్టీకి, అలాగే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తిగా అనుకూలంగా ఈ సినిమాను తీశారని ఆయన లెటర్ లో పేర్కొన్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి, అలాగే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధినేత సోనియా గాంధీకి వ్యతిరేకంగా తీయడంతో పాటు వారి పాత్రలను కించపరుస్తూ, వ్యంగ్యంగా ఈ చిత్రంలో చిత్రీకరించారని ఆయన వివరించారు.


పబ్లిసిటీ కోసం తాజాగా విడుదల చేసిన ట్రైలరే ఇందుకు ఉదాహరణ అని, వారితో దగ్గరి పోలికలు ఉన్న ఆర్టిస్టులను ఈ సినిమాలో పెట్టి  కుట్రదారులుగా చూపించారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీని,  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడును చులకనగా చూపించడం వెనుక త్వరలో జరగబోయే  లోక్‌సభ ఎన్నికల్లో  ప్రత్యేకంగా  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందాలన్న ఉద్దేశ్యం కనిపిస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్వరలో  లోక్ సభ ఎన్నికల కోడ్ రాబోతున్న సమయంలో ఈ సినిమాను కరెక్టు గా ఇదే టైం లో విడుదల చేసేందుకు నిర్ణయించడం కూడా దురుద్దేశమే అన్నారు. మరో విషయం ఏమిటంటే.


ఇంకా సెన్సార్ చేయకుండానే ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 8వ తేదీగా ప్రకటించారని, వాస్తవానికి మార్గదర్శకాల ప్రకారం సెన్సార్ జరపకుండా  విడుదల తేదీని ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై కూడా సెన్సార్ అధికారులు చర్యలు తీసుకోవాలని నట్టి కుమార్‌ కోరారు. అలాగే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఈ చిత్రాన్ని సెన్సార్ చేయవద్దని, ఎన్నికల తర్వాతే సెన్సార్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదీకూడా ఈ చిత్రంలోని  పాత్రలు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, వ్యంగ్యంగా, అవమానకరంగా, కుట్రపూరితంగా లేకుండా సెన్సార్ చేయాలని, సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా సెన్సార్ చేయడానికి 66 రోజుల వరకు వ్యవధి  ఉంటుందని చెబుతున్నారు.


ఇలాంటి సున్నితమైన రాజకీయ అంశాలతో కూడిన సినిమాను సెన్సార్ చేయడం ఈ టైమ్ లో  కరెక్ట్ కాదని నా అభిప్రాయం అని లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎన్నికలకు ముందు విడుదలైతే ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అందుకే ఎన్నికల తర్వాత ఈ సినిమాకి సెన్సార్ జరగాలని, అలాగే సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకున్న చాలా చిత్రాలను ప్రాధాన్యతా క్రమంలో మాత్రమే చూడాలన్నారు. ఈ విషయంలో చిన్న పెద్ద అనే తేడా ఉండకూడదని, పైన పేర్కొన్న తమ నాయకులను కించపరిచే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు సెన్సార్ లేదా విడుదల చేయడానికి ప్రయత్నించినట్లయితే, తాను లీగల్ గా  ముందుకు వెళ్తానని మీకు తెలియజేస్తున్నానని నట్టి కుమార్ తన లేటర్లో పేర్కొన్నారు.