సీనియర్ హీరోయిన్ ప్రియమణి వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలు అనే తేడా లేకుండా ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. హీరోయిన్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ప్రియమణి,  తమిళ చిత్రం ‘పరుత్తివీరన్‌’తో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. పెళ్లి తర్వాత నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్‌’ మూవీలో కీలపాత్ర పోషించింది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలను ఆమె వెల్లడించింది.


‘జవాన్’లో నా పాత్ర చూసి ఆశ్చర్యపోయా- ప్రియమణి


‘జవాన్’ చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలియగానే సంతోషం కలిగిందని చెప్పింది ప్రియమణి. అయితే, ఏదో క్యామియో పాత్ర ఉంటుందని భావించినట్లు వెల్లడించింది.  కానీ, షారుఖ్ టీమ్ లో కీలక పాత్ర చేసే అవకాశం రావడంతో ఆశ్చర్యపోయినట్లు వెల్లడించింది. ‘జవాన్’ చిత్రం అద్భుత విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పింది. 2013లో విడుదలైన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లో షారుఖ్ తో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అప్పట్లో ఓపాటలో ఆయనతో జతకట్టినట్లు వివరించింది.  ఈ పాట కోసం 5 రోజులు తనతో పని చేయగా,  ‘జవాన్’ చిత్రం కోసం తనతో ఏకంగా 4 నెలల పాటు పని చేసినట్లు తెలిపింది. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ చిత్రంలో, షారుఖ్ కు సాయం చేసే ఆరుగురు స్త్రీలలో ఒకరైన లక్ష్మి పాత్రను ప్రియమణి పోషించింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు  రూ.574.89 కోట్లు వసూలు చేసింది.


‘పాన్ ఇండియన్’ పదాన్ని వాడకపోవడం మంచిది- ప్రియమణి


ఇక  ‘పాన్ ఇండియన్’ మూవీస్ విషయంలో ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇకపై మనం పాన్-ఇండియన్ అనే పదాన్ని ఉపయోగించకపోవడం మంచిదని భావిస్తున్నట్లు చెప్పింది.  “మనమందరం భారతీయులం. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఉండకూడదు. సౌత్ కు చెందిన శ్రీదేవి, జయప్రద బాలీవుడ్ లో అద్భుతంగా రాణించారు. నార్త్ కు చెందిన రేఖ, వైజయంతిమాల అద్భుత చిత్రాలతో అలరించారు.  ప్రస్తుతం ఉత్తరాది, దక్షిణాది కళాకారులు సమాన అవకాశాలు పొందుతున్నారు.  మనకు అన్ని చోట్లా అవకాశాలు వస్తున్నాయి. పాన్ ఇండియన్ మూవీ, పాన్ ఇండియన్ యాక్టర్ అని ఉపయోగించడం మానుకోవడం మంచింది. ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారింది. సౌత్ లో బాలీవుడ్ స్టార్స్ ను చక్కగా ఆదరిస్తున్నారు” అని ప్రియమణి తెలిపింది.  


షారుఖ్ అద్భుతమైన వ్యక్తి- ప్రియమణి


ఇక నటుడు షారుఖ్ ఖాన్ పై ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ఇక పదేండ్ల క్రిత షారుఖ్ ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని  వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే, గతంతో పోల్చితే ఇప్పుడు మరింత యంగ్ గా కనిపిస్తున్నాడని తెలిపింది. తాను వర్క్ చేసిన నటుల్లో షారుఖ్ అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించింది. ప్రియమణి ప్రస్తుతం 2022లో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన తెలుగు చిత్రం ‘భామాకలాపం’ సీక్వెల్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.


Read Also: అందుకే అక్షయ్ సినిమా నుంచి నానా పటేకర్‌ను తీసేశారా? ‘జంగిల్’ మేకర్స్‌పై నానా హాట్ కామెంట్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial