Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు చాలాకాలం తర్వాత ఆశించిన రేంజ్‌లో ఫీస్ట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ కటౌట్‌కు ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ యాడ్ అయ్యి.. మూవీ ఓ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఫోకస్ అంతా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘కల్కి 2898 ఏడీ’పై పడింది. ఇక ఈ సినిమా గురించి తాజాగా వైరల్ అవుతున్న రూమర్స్.. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఎగ్జైట్ చేస్తున్నాయి.


గెస్ట్ రోల్స్ చేస్తున్న హీరోలు..


నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. ఇప్పటివరకు తెలుగు సినిమా మాత్రమే కాదు.. వరల్డ్ సినిమా చూడనంత గ్రాండ్‌గా తెరకెక్కుతుందని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. అందుకే షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇంతలోనే ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు కొందరు హీరోలు గెస్ట్ అప్పీయరెన్స్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి యంగ్ హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తున్నారని రూమర్స్ బయటికొచ్చాయి. అయితే అవి రూమర్స్ కాదని.. నిజంగానే ‘కల్కి 2898 ఏడీ’లో ఉన్నానని దుల్కర్ స్వయంగా ప్రకటించాడు. ఇంతలో ఈ మూవీలో గెస్ట్ రోల్స్ చేస్తున్న హీరోల లిస్ట్‌లో మరో ఇద్దరి పేర్లు యాడ్ అయ్యాయి.


మూడు కాలాల్లో సినిమా..


‘కల్కి 2898 ఏడీ’ మూవీ గతం, వర్తమానం, భవిష్యత్తు కాలాలకు సంబంధించి ఉంటుందని ఇప్పటికే నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ఈ సినిమా నుండి విడుదలయిన గ్లింప్స్ చూస్తుంటే కూడా ఇదొక సైన్స్ ఫిక్షన్ కథ అని స్పష్టమవుతోంది. అయితే ఇందులో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌తో పాటు ఎన్‌టీఆర్, నాని కూడా గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారని సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో వీరిద్దరు కీలక పాత్రల్లో కాసేపు కనిపించి వెళ్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్లు ఈ సినిమాలో భాగమయ్యారు.


ఆ పాత్రల్లో నాని, ఎన్‌టీఆర్..


‘కల్కి 2898 ఏడీ’లో కృపాచార్య పాత్రలో నాని, పరశురాముడిగా ఎన్‌టీఆర్ కాసేపు కనిపించి ప్రేక్షకులను అలరించనున్నట్టు సమాచారం. ఇదే నిజమయితే సిల్వర్ స్క్రీన్ షేక్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీరిద్దరూ కనిపించేది కాసేపే అయినా వీరి పాత్రలు మాత్రం సినిమాలో చాలా కీలకంగా మారనున్నాయని సోషల్ మీడియా సమాచారం. డిసెంబర్‌లోనే ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయని, ఔట్‌పుట్ సరిగా రావాలంటే ఇంకా కొన్నిరోజులు వేచి చూడాలని నాగ్ అశ్విన్ ప్రకటించాడు. ఇప్పుడు మే 9న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరోసారి ‘కల్కి 2898 ఏడీ’ పోస్ట్‌పోన్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నా.. మూవీ టీమ్ మాత్రం దీనిపై స్పందించడం లేదు.


Also Read: డాక్యుమెంటరీగా షీనాబోరా మర్డర్ కేసు, నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్, ఎప్పటి నుంచి అంటే?