సౌత్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.  రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇప్పటికే నవీన్ పొలిశెట్టి కాలేజీలు, షాపింగ్ మాల్స్, మల్టీ ఫ్లెక్స్ లలో తిరుగుతూ బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఆయన స్టాండప్ ప్రమోషనల్ టూర్‌కు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన లభించింది.


‘MSMP రెసిపీ’ ఛాలెంజ్‌ ప్రారంభించిన అనుష్క


తాజా స్వీటీ అనుష్క ఒక సరికొత్తగా ప్రమోషన్స్ షురూ చేసింది.  ఆమె ఈ చిత్రంలో చెఫ్ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ‘MSMP రెసిపీ’ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఈ ఛాలెంజ్ లో భాగంగా తనే స్పెషల్ రెసిపీని అభిమానులతో పంచుకుంది.  సోషల్ మీడియాలో ఈ రెసిపీని షేర్ చేస్తూ, "#MissShettyMrPolishettyలో  చెఫ్ పాత్రను పోషించడం చాలా సరదాగా ఉంది. ఈ రోజు, నేను మీ అందరితో నాకిష్టమైన వంటకాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. అంతేకాదు, #MSMPRecipeChallengeని కిక్‌స్టార్ట్ చేయాలనుకుంటున్నాను" అని రాసుకొచ్చింది.


ప్రభాస్ కు అనుష్క ఛాలెంజ్


ఈ పోస్టుకు  పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ ను ట్యాగ్ చేసింది. "మనందరికీ తెలిసినట్లుగా, ఫుడ్ బాగా ఇష్టపడటంతో పాటు, ఇతరులకు చక్కగా తినిపించడంలో ప్రభాస్ కు మంచి పేరుంది. అందుకే ఆయనతోనే ఈ ఛాలెంజ్ ప్రారంభిస్తున్నాను. అతడికి ఇష్టమైన వంటకాన్ని మాతో పంచుకోవడంతో పాటు #MSMPRecipeChallengeని కొనసాగించేందుకు నేను అతడికి ట్యాగ్ చేస్తున్నాను. మీరందరూ #MSMPrecipechallengeని స్వీకరించి, మీకు ఇష్టమైన వంటకాలను నాతో పంచుకోవాలని కోరుతున్నాను” అని వెల్లడించింది.  


రొయ్యల పులావ్ వండిన ప్రభాస్


అనుష్క ఛాలెంజ్ ను ప్రభాస్ స్వీకరించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఘుమఘుమలాడే రొయ్యల పులావ్ ను వండారు. ఈ రెసిపీని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అంతేకాదు,  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ఈ ఛాలెంజ్ లో పాల్గొనాలంటూ ట్యాగ్ చేశారు. అతడికి ఇష్టమైన వంటకాలను పంచుకోవాలన్నారు.  ఇక ప్రభాస్, అనుష్క జోడీ తెలుగు సినిమా పరిశ్రమలో హిట్ జోడీగా నిలిచింది. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించినా, ‘బాహుబలి’ ఓరేంజిలో పేరు తీసుకొచ్చింది. ఆ మధ్య వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, వాటిపై ఇద్దరూ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. చాలా రోజుల తర్వాత రెసిపీ ఛాలెంజ్ తో అనుష్క, ప్రభాస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.






అనుష్క కెరీర్ లో‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ 48వ చిత్రంగా రాబోతోంది. 'నిశ్శబ్దం' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమె నటించిన సినిమా ఇది. మరోవైపు 'జాతిరత్నాలు' వంటి బ్లాక్‍ బాస్టర్ తర్వాత నవీన్ పోలిశెట్టి చేస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రధన్ సంగీతం సమకూరుస్తున్నారు.


Read Also: ఈ వారం థియేటర్లలో ‘జవాన్‘తో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఢీ - ఓటీటీలోకి ‘జైలర్’ ఎంట్రీ!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial