కొంతమంది ఆన్ స్క్రీన్ కపుల్స్‌ను చూస్తుంటే వీరు ఆఫ్ స్క్రీన్ కపుల్స్ అయితే కూడా ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. అలాంటి కపుల్స్ టాలీవుడ్‌లో చాలామందే ఉంటారు. మామూలుగా ఒక సినిమాకు హైప్ రావాలంటే దర్శకుడు లేదా హీరో వల్ల సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా సినిమాకు హైప్‌ను క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఇవేవి కాకుండా హీరో, హీరోయిన్ పెయిర్ చూసి సినిమాపై అంచనాలను పెంచుకునేవారు కూడా ఉంటారు. టాలీవుడ్‌లో అలాంటి కపుల్ ఎవరంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్, అనుష్క. వీరిద్దరూ మళ్లీ ఒకే స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని ఎదురుచూసే ఫ్యాన్స్ త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.


ఆరడుగుల అందగాడు ప్రభాస్.. తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎంతోమంది హీరోయిన్లతో నటించాడు. కానీ అనుష్కతో సెట్ అయిన కెమిస్ట్రీ ఇంకా ఏ హీరోయిన్‌తో సెట్ అవ్వలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. అంతే కాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, ఆఖరికి పెళ్లి కూడా చేసేసుకుంటున్నారని పలుమార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ ప్రభాస్, అనుష్క ఎప్పటికప్పుడు తాము మంచి స్నేహితులమని, జీవితాంతం ఈ స్నేహం ఇలాగే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అయినా కూడా వీరిద్దరు పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ కపుల్‌గా మారితే చూడాలని ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీరు కలిసి సినిమాలు చేయకపోవడంతో కనీసం స్క్రీన్‌పై కలిసి కనిపించినా చాలు అని కోరుకుంటున్నారు.


‘బిల్లా’ నుంచి ‘బాహుబలి’ వరకు..


ప్రభాస్, అనుష్క మొదటిసారిగా ‘బిల్లా’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో ఇద్దరు స్టైలిష్ లుక్స్‌లో కనిపించడంతో పాటు తమ కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మిర్చిలో వీరి కెమిస్ట్రీ మరోసారి అద్భుతంగా పండింది. బాహుబలి పార్ట్ 2లో అమరేంద్ర బాహుబలి, దేవసేనగా పోటాపోటీగా నటించి మరోసారి అందరినీ ఫిదా చేశారు. అప్పటినుంచి వీరిద్దరు కలిసి మరిన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు కోరుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో బాహుబలి తర్వాత అనుష్క సినిమాల్లో నటించడం చాలావరకు తగ్గించేసింది. ప్రస్తుతం తను సినిమాలు చేస్తే చాలు అని అనుకోవడం మొదలుపెట్టారు తన ఫ్యాన్స్. కానీ ఇంతలోనే ప్రభాస్, అనుష్క మళ్లీ కలిసి నటిస్తారు అనే వార్తలు తెరపైకి వచ్చాయి.


‘బాహుబలి’ నిర్మాత కోసం


బాహుబలికి నిర్మాతగా వ్యవహరించిన శోభు యార్లగడ్డ.. ప్రభాస్, అనుష్కను మళ్లీ ఒకే స్క్రీన్‌పై చూపించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారట. త్వరలోనే శోభు.. ప్రభాస్‌తో ఒక భారీ బడ్జెట్‌ సినిమాను తెరకెక్కించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో ప్రభాస్‌కు జోడీగా ఈ భారీ బడ్జెట్ సినిమాలో అనుష్క నటిస్తే బాగుంటుందని ఈ స్టార్ ప్రొడ్యూసర్ భావించారట. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి నటిస్తే.. సినిమాకు తగినంత హైప్ కూడా దక్కుతుంది. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి చేసే నెక్స్‌ట్ చిత్రం కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన వసూళ్లు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించడంలో శోభు యార్లగడ్డ కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయన అడిగితే ప్రభాస్, అనుష్క మళ్లీ కలిసి కచ్చితంగా సినిమా చేస్తారని అందరి అంచనా.


Also Read: ఆఫర్ల కోసం స్టార్ హీరోలతో డేట్ చేయమని అడిగారు: నోరా ఫతేహి షాకింగ్ కామెంట్స్