బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కనిపిస్తున్న లేటెస్ట్ మైథాలజికల్ మూవీ 'ఆదిపురుష్' రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మూవీ విడుదల సందర్భంగా తిరుపతిలో ఈ సినిమాకు సంబంధించి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. గతంలో కని విని ఎరుగని రీతిలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాతలు తిరుపతిలో ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు.


అంతేకాకుండా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి హాజరుకానున్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా చరిత్రలోనే మొదటిసారి 50 అడుగుల ప్రభాస్ హాలో గ్రామ్ సైతం ప్రదర్శించబోతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండడం గమనార్హం. అయితే తాజాగా టికెట్ల విక్రయ విషయంలో ఆదిపురుష్ చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కాసేపు క్రితమే ఆదిపురుష్ మూవీ టీం ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది.


ఈ ప్రకటనలో మూవీ టీం పేర్కొంటూ.. "రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకానికి గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతి గొప్ప రామభక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన 'ఆదిపురుష్' ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం" అంటూ చిత్ర యూనిట్ తాజా ప్రకటనలో భాగంగా పేర్కొంది.


ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీం ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. మొదట విడుదల చేసిన ట్రైలర్ కంటే ఈ రెండవ ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. రెట్రో ఫైల్స్, టి సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజయ్ - అతుల్ సంగీతమందిస్తున్నారు.