సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదని అంటుంటారు. నేపోటిజం, ఫేవరిజం ఎక్కువగా ఉండే పరిశ్రమలో, ప్రతిభతో పాటుగా ఎంతో కొంత సపోర్ట్ ఉండాలని చెబుతుంటారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. 


ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, కేవలం తన స్వయంకృషితో వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ప్రస్తుతంలీడ్ రోల్స్ లో తన విలక్షమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే కెరీర్ ప్రారంభ దశలో తాను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు నవాజుద్దీన్ వెల్లడించారు. 


సిద్ధిఖీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటూ, ''సెట్‌ లో స్పాట్ బాయ్‌ ని నీళ్లు అడిగినా, ఇవ్వని సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రొడక్షన్‌ హౌసెస్ లు భోజన సమయాల్లో కాస్ట్ అండ్ క్రూని వేర్వేరుగా చూస్తాయి. జూనియర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ ఆర్టిస్టులు విడివిడిగా తింటారు. లీడ్ యాక్టర్స్ కు వేరే సపరేట్ ప్లేస్ ఉంటుంది'' అని తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్స్‌ లాంటి కొన్ని ప్రొడక్షన్స్‌ లో మాత్రం అందరూ కలిసి తింటారని.. కానీ చాలా వరకు ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రం వేర్వేరుగా చూస్తుంటాయని అన్నారు. 


తాను తరచుగా లీడ్ యాక్టర్స్ తినే చోట తినడానికి ప్రయత్నించే వాడినని, కానీ తనను కాలర్ పట్టుకుని అక్కడి నుండి బయటకు లాగేసేవారని నాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు సిద్ధికి. తనకు ఇగో ఎక్కువ అని.. బాగా కోపం వచ్చేదని, అందరు నటీనటులకు తగినంత గౌరవం ఇవ్వాలని నేను అనుకునేవాడినని అన్నాడు. కొన్నిసార్లు మాత్రం వారు లీడ్ యాక్టర్స్ తో కలిసి తినడానికి నన్ను అనుమతించేవారని నవాజుద్దీన్ చెప్పారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'జంగిల్' సినిమా కోసం తాను రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపాడు. బదులుగా, ప్రొడక్షన్ హౌస్‌ లో రెండు మూడు నెలలు భోజనం చేసేవాడినని నటుడు చెప్పుకొచ్చాడు. 'షూల్' సినిమాకి కూడా తాను పారితోషికం తీసుకోలేదని తెలిపాడు. 


కాగా, న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ అఫ్ డ్రామాలో కోర్స్ పూర్తి చేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ.. 1999లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 'సర్ఫారోష్' చిత్రం ద్వారా సినీరంగం ప్రవేశం చేసాడు. ఆ తర్వాత షూల్, జంగిల్, మున్నాభాయ్ MBBS, ది బైపాస్, దేవ్ డి, పీప్లీ లైవ్, కహానీ, పాన్ సింగ్ తోమర్ వంటి చిత్రాల్లో నటించాడు. 2012 లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' సినిమాలతో నవాజుద్దీన్ ఓవర్ నైట్ స్టార్ సెన్సేషన్ గా మారిపోయాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 


'పేట' వంటి తమిళ్ డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన నవాజుద్దీన్ సిద్దిఖీ.. 'సైంధవ్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ 2023 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?