PM Modi responds to Rashmika Mandannas post on Mumbai's Atal Setu: నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే మెప్పించింది. ఒక పక్క దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేల రష్మిక మందన్నా చేసిన ఓ వీడియో రాజకీయా వర్గాల్లో ఆసక్తిని పెంచింది. సోషల్‌ మీడియాలో రష్మిక ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని నెట్టింట షేర్‌ చేసుకుంటుంది. రీసెంట్‌గా ముంబైలో పర్యటించిన రష్మిక ఓ ఆసక్తికర వీడియో షేర్‌ చేసింది. ముంబై పర్యటనలో భాగంగా రష్మిక ఇటీవల కొత్త ప్రారంభించిన ఆటల్‌ సేతు సముద్ర వంతెనపై ప్రయాణించింది. 


ఇదోక అద్భుతమైన అనుభూతి: రష్మిక


ఈ సందర్భంగా ఆటల్‌ సేతు వంతెన నిర్మాణ వల్ల ప్రయోజనం, దీనిపై ప్రయాణిస్తుండగా కలిగిన అనుభూతులను రష్మిక ఓ వీడియో ద్వారా పంచుకుంది.ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. భారత్‌లో సాధ్యం కానిది అంటూ ఏం లేదు. గత 10 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది. దీనికి ఈ ఆటల్‌ సేతు వంతెన ఉదాహరణ. దీనిపై ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. దాదాపు 2 గంటల ప్రయాణాన్ని ఈ వంతెన కేవలం 20 నిమిషాలు మాత్రమే చేసింది. ఈ అటల్ సేతను చూసినప్పుడు మాటలు రాలేదు. ప్రస్తుతం యంగ్‌ ఇండియా అభివృద్ధిలో అత్యంత వేగంగా దూసుకుపోఉంది. భారత్‌ చాలా తెలివైన దేశం. ఇప్పుడు బాధ్యతగా అభివృద్ధికి ఓటు వేయాల్సిన బాధ్యత యువతదే" అంటూ రష్మిక నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సపోర్టుగా ఈ వీడియో షేర్‌ చేసింది. 






అంతకంటే సంతృప్తికరమైంది లేదు: మోదీ


అంతేకాదు ఈ వీడియో పోస్ట్‌ చేస్తూ.. "సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా; వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకూ.. ప్రజలను కలుపుతుంది.. హృదయాలను కలుపుతుంది" అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఈ వీడియోపై ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రష్మిక వీడియోను ఆయన రీట్వీట్‌ చేస్తూ.. "ప్రజలను కనెక్ట్ చేయడం. వారి జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైంది మరోకటి లేదు" అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్విట్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే నరేంద్ర మోదీకి మద్దతుగా రష్మిక ఈ వీడియో షేర్‌ చేసిందని, ఇదంతా కావాలనే చేసిందంటూ ట్రోలర్స్‌ రష్మికపై నెగిటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రష్మిక ట్వీట్‌కు ప్రధానీ మోదీ స్పందించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని నెలకొంది. దీంతో ఈ నేషనల్‌ క్రష్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. 


కాగా ఈ అటల్ సేతు వంతెనను ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ - ఎంటీహెచ్ఎల్‌ కలుపుతూ నిర్మించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని నహవా శేవాను కలుపుతూ నిర్మించారు. మొత్తం రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా 21.8 కిలోమీటర్ల పొడవు ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం. దీంతో మన దేశంలో సముద్రంపై నిర్మించిన అతి పొడవైన సముద్ర వంతెనగా ఈ అటల్ సేతు నిర్మాణం రికార్డుకి ఎక్కింది. ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.