Raviteaj - Harish Shankar : మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇద్దరూ ముంబైలో సందడి చేశారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ కొత్త సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో ఈ టాలీవుడ్ స్టార్స్ మెరవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వీరితోపాటు పీపుల్ మీడియా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవితేజ, హరీష్ శంకర్ అజయ్ దేవగన్ కొత్త సినిమా ఓపెనింగ్ కి వెళ్లడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న 'రైడ్ 2' సినిమా ఓపెనింగ్ కార్యక్రమం శనివారం ముంబైలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మూవీ టీం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.


ఈ సందర్భంగా అజయ్ దేవగన్ రవితేజకి థాంక్స్ చెప్పారు. ఆయన సమక్షంలో 'రైడ్ 2' ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉందని అన్నారు. దీనికి రవితేజ రియాక్ట్ అవుతూ..' తాను ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నానని, ఇది మెమరబుల్ మూవీ కావాలని, అదే సమయంలో పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ' చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు. అయితే 'రైడ్ 2' ఓపెనింగ్ కి రవితేజ, హరిష్ శంకర్ వెళ్లడానికి కారణం, అజయ్ దేవగన్ 'రైడ్' సినిమాని వీళ్ళిద్దరూ రీమేక్ చేస్తుండటమే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అయితే హరిష్ శంకర్ ఈ సినిమాని అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. సుమారు 5ఏళ్ల క్రితం వచ్చిన 'రైడ్' హిందీలో భారీ సక్సెస్ అందుకుంది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అదే సినిమాని తెలుగులో 'మిస్టర్ బచ్చన్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ కి సీక్వెల్ గా 'రైడ్ 2' బాలీవుడ్ లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో రవితేజ, హరీష్ శంకర్ పాల్గొన్నారు. ఐటీ రైట్స్ నేపథ్యంలో సాగనున్న 'రైడ్ 2' ఓ కొత్త కేసు నేపథ్యంలో ఉండబోతుంది.


నవంబర్ 15న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మరికొందరు నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నారు. రైడ్ మూవీలో అజయ్ దేవగన్ పోషించిన అమేయ్ పట్నాయక్ పాత్రనే ఈ సీక్వెల్లో కొనసాగబోతోంది. ఒకవేళ 'రైడ్ 2' కూడా సక్సెస్ అయితే హరిష్ శంకర్ ఈ సీక్వెల్ ని తెలుగులోనూ రీమేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Also Read : బిడ్డను కోల్పోయిన జబర్దస్త్ కమెడియన్, సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు