రాజకీయాలు, సినిమాలు... ఇప్పుడు రెండు రంగాల్లోనూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బిజీ బిజీ. ఆయన సినిమాలు మూడు సెట్స్ మీద ఉన్నారు. మరోవైపు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నెల నుంచి జనసేనాని వారాహి యాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' చిత్ర బృందాలు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నాయని, అయోమయంలో పడ్డాయని, రాజకీయ యాత్రలో పవన్ బిజీ కావడంతో ఆ రెండు సినిమాలకు ఇప్పట్లో డేట్స్ కేటాయించడం కష్టం అని కామెంట్స్ వినిపించాయి. వాటికి 'ఓజీ' యూనిట్ చెక్ పెట్టింది. 


'ఓజీ' లేటెస్ట్ షెడ్యూల్ షురూ! 
'ఓజీ' లేటెస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టమని ఆదివారం చిత్ర బృందం తెలిపింది. హైదరాబాద్ సిటీలో షూటింగ్ చేస్తున్నామని పేర్కొంది. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అవుతారని డీవీవీ మూవీస్ తెలియజేసింది. వారాహి యాత్ర మొదలైనా సరే... షూటింగుకు ఎటువంటి ఆటంకం ఉండదని, పవన్ కళ్యాణ్ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారని పరోక్షంగా సమాధానం ఇచ్చినట్టు అయ్యింది.


దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ టీమ్ ఒక్కటి స్పష్టం చేయాలని అనుకుంటున్నట్లు ఉంది... 'రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే' అని! పవన్ రాజకీయ యాత్రలు సినిమా షూటింగులు అడ్దు కాబోవు అని!


ఓజీ వచ్చాక స్టిల్స్ రిలీజ్ చేద్దాం అబ్బాయ్!
'ఓజీ' లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిన సందర్భంగా ''వర్కింగ్ స్టిల్స్ ఇవ్వు బాబాయ్'' అని ఓ అభిమాని అడిగారు. ''ఓజీ వచ్చాక ఇద్దాం అబ్బాయ్'' అంటూ డీవీవీ మూవీస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సమాధానం వచ్చింది. అంటే... పవన్ కళ్యాణ్ సెట్స్ కు వచ్చిన తర్వాత వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేస్తారన్నమాట. అదీ సంగతి!


Also Read : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?



'ఓజీ'లో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయిక. నాని 'గ్యాంగ్ లీడర్' తర్వాత తెలుగులో ఆమె చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలకు చిత్రీకరణ ఫినిష్ చేస్తానని, అందుకు తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని పవన్ చెప్పారట.


'బ్రో' తర్వాత 'ఓజీ' వస్తుందా?
'ఓజీ' చిత్రీకరణ అక్టోబర్ నెలకు పూర్తి అయితే పవర్ స్టార్ అభిమానులకు పండగే. జూలై 28న 'బ్రో' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత 'ఓజీ' విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది పవన్ నుంచి మరో సినిమా రావచ్చు. హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.   


Also Read 'ఇండియన్ ఐడల్ 2' ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ & జర్నీ - మీకు తెలుసా?


'ఓజీ' చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ముంబైలో ఓ షెడ్యూల్ చేశారు. అందులో పవన్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ (Prakash Raj In OG) కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.