కొన్ని రోజుల క్రితం రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేసిన సంగతి అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది.. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీల విషయంలో డీప్ ఫేక్ అనేది ఒక పీడకలగా మిగిలింది. అయితే అందరికంటే ఎక్కువగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై వివాదం మాత్రం పెద్ద ఎత్తున చెలరేగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి రష్మిక మందన్ననే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం విశేషం. ఒకప్పుడు డీప్ ఫేక్ బారిన పడిన రష్మిక మందన్నతోనే సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ మేరకు రష్మిక మందన్న ఓ వీడియోను షేర్ చేస్తూ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది. 


ఆ వీడియోలో ఏముందంటే... 
రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో తన డీప్ ఫేక్ వీడియోని వైరల్ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. రష్మిక మాట్లాడుతూ 'నా డీప్ ఫేక్ వీడియో చాలా వైరల్ అయ్యింది. నిజానికి అదొక సైబర్ నేరం. ఇది జరిగినప్పుడే నేను ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వంతో కలిసి ఇలా సైబర్ నేరాలపై పని చేస్తున్నాను. కేంద్ర హోమ్ అఫైర్స్ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనే సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాను. సైబర్ నేరగాళ్లు ఎప్పుడు, ఎలా దాడి చేస్తారు అనే విషయాన్ని మనం అంచనా వేయలేము. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండడంతో పాటు కలిసికట్టుగా పోరాడదాం. దేశాన్ని సైబర్ రహిత నేర కంట్రీగా క్రియేట్ చేసుకుందాం' అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. 






నేషనల్ క్రష్ బిజీబిజీ 
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అతి తక్కువ టైంలోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ 'పుష్ప' మూవీ చేసిన తర్వాత డీప్ ఫేక్ బారిన పడింది. జారా అనే ఇన్ఫ్లుయెన్సర్ షేర్ చేసిన ఒరిజినల్ వీడియోలో రష్మిక మందన్న ఫేస్ ను ఎడిట్ చేసి అసభ్యకరంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. దీనిపై రష్మిక మందన్న ఫైర్ అవుతూ సైబర్ క్రైంకి అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ చేసిన కొన్ని రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఇక ఆ తర్వాత కూడా పలువురు సినీ ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. కాగా ప్రస్తుతం రష్మిక మందన్న 'పుష్ప 2', 'గర్ల్ ఫ్రెండ్'తో పాటు 'యానిమల్ 2', 'సికిందర్' వంటి పాన్ ఇండియా సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంది.


Read Also ; Jr NTR : 'దేవర'ను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు- అభిమానులకు హామీ ఇస్తూ తారక్ స్పెషల్ పోస్ట్ వైరల్