Rakul Preet Singh: కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా రాణించింది అందాల రకుల్ ప్రీత్ సింగ్. అగ్ర హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ.. అందరితో జోడీ కట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంది. అయితే వరుసగా పరాజయాలు పలకరించడంతో తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బాలీవుడ్ కు చెక్కేసి హిందీలో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమెకు ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. అటు పర్సనల్ గా, ఇటు ప్రొఫెషనల్ గా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 


భర్త నిర్మించిన సినిమా ఫ్లాప్


రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత జాకీ భగ్నానిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో తన ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే ఇటీవల తన భర్త నిర్మించిన 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో కంపెనీకి దాదాపు రూ.250 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయని, దివాళా తీసే పరిస్థితి వచ్చిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. 


‘భారతీయుడు 2’ ఎదురుదెబ్బ


'బడే మియాన్ చోటే మియాన్' సినిమాకి వర్క్ చేసిన సిబ్బందికి, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా వాషు భగ్నాని ఫ్యామిలీ ఇబ్బంది పడిందని బాలీవుడ్ మీడియాలో నివేదికలు పేర్కొన్నాయి. దీంతో భర్తతో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ అనుకోని విధంగా వార్తల్లో నిలిచారు. ఇక సినిమాల పరంగానూ రకుల్ కు నిరాశే ఎదురైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'భారతీయుడు 2' చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది.


శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఇండియన్ 2'. ఇందులో సిద్దార్థ్ తో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాతో హిట్టు కొట్టి మళ్ళీ సౌత్ లో పాగా వేస్తుందని అభిమానులు భావించారు. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిడివి తక్కువ అయినా ఈ సినిమా విజయం సాధించి ఉంటే ఆమెకు కాస్త ఊరట లభించేది. కానీ అలా జరగలేదు.


డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్


ఇదిలా ఉండగానే సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ కావడంతో రకుల్‌ ప్రీత్ సింగ్ కు మరో పెద్ద షాక్‌ తగిలినట్లు అయింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్‌లోని అతని నివాసంలో రూ.2 కోట్ల విలువైన 2.6 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమన్ కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో, రకుల్ ప్రీత్ సింగ్ సైతం వార్తల్లో నిలిచింది.


గతంలో డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో రకుల్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన సంగతి తెలిసిందే. అలానే హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు సంబంధించిన డ్రగ్ కేసులో ఎన్సీబీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఇప్పుడు తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ సైతం డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో, రకుల్ మాదక ద్రవ్యాల కేసులో విచారణ ఎదుర్కొన్న విషయాలు మళ్ళీ వార్తల్లో వచ్చాయి. మరి త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ వీటన్నిటి నుంచి బయట పడి సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తుందేమో చూడాలి.


Also Read: అల్లు శిరీష్ 'బడ్డీ' వాయిదా - రిలీజ్ ఎప్పుడంటే?