Murali Mohan: తన సినీ కెరీర్‌లో ఎన్నో ప్రమాదాలను చూశానని, కానీ రెండు ఇన్సిడెంట్లను అస్సలు మర్చిపోలేనని చెప్పారు సీనియర్ నటుడు మురళీ మోహన్. అప్పట్లో సినిమా షూటింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లమని చెప్పారు. అయినా, కొన్నిసార్లు ఊహించని పరిణామాలు జరిగాయన్నారు. దర్శకుడు దాసరి నారాయణరావుతో సినిమాలు చేస్తున్నప్పుడు రెండు సంఘటనలు తమను షాక్‌కు గురి చేశాయన్నారు.


శ్రీదేవి తొలి సినిమా షూటింగ్ లో చిన్నారి మృతి


శ్రీదేవి హీరోయిన్‌గా చేస్తున్న తొలి సినిమా షూటింగ్ సమయంలో పాప చనిపోవడం బాధను కలిగించిందన్నారు మురళీ మోహన్. “దాసరి నారాయణరావుతో చేసిన రెండు సినిమాల్లో రెండు పెద్ద ప్రమాదాలను చవి చూశాను. వాటిని ఇప్పటి వరకు మర్చిపోలేను. ‘బంగారక్క‘ అనే ఓ సినిమా చేశాం. శ్రీదేవి హీరోయిన్‌గా మొదటి సినిమా. నేను హీరోగా చేశాను. ఈ సినిమాలో ఆమె మెచూరిటీ లేని అమ్మాయిలా కనిపిస్తుంది. చుట్టూ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆమె చుట్టూ ఉండేందుకు ఓ జూనియర్ ఆర్టిస్టు పిల్లలను తీసుకొచ్చేవాడు. ఓ రోజు అవుడ్ డోర్ షూటింగ్‌కు వెళ్లాం. సినిమాలో నటించాల్సిన పిల్లలతో పాటు ఓ చిన్న పాప వచ్చింది. షూటింగ్ చూడాలని వచ్చింది. మేం తీసుకొచ్చిన పిల్లల లిస్టులో ఆమె లేదు. మేం తీసుకొచ్చిన వాళ్లు అందరూ వచ్చారా? లేదా? అని చూసుకున్నాం. అందరూ సరిగానే ఉన్నారు. వారిని ప్రొడక్షన్ వాళ్లు జాగ్రత్తగానే చూసుకున్నారు. సాయంత్రం.. ఓ వ్యక్తి వచ్చి మా అమ్మాయి కనిపించడం లేదన్నారు. మీ అమ్మాయి మా సినిమాలో లేదు కదా అన్నాం. ఇంకో పాప ఉందండి, ఆమెతో పాటు ఈ పాప కూడా వచ్చిందన్నారు. చెరువులో యాక్ట్ చేశారు. ఆ తర్వాత కనిపించలేదన్నారు. వెంటనే జనాలను తీసుకొచ్చి వెతికితే పాప బురదలో కూరుకుపోయి ఉంది. మేమంతా అప్ సెట్ అయ్యాం. మాకు తెలియకుండా ఆ ఘటన జరిగింది. అందరం చాలా బాధపడ్డాం.


రైలు తగిలి నటుడు ఏవీ చలం మృతి


“నేను, ఏవీ చలం కలిసి దాసరి గారి దగ్గర ‘అద్దాల మేడ’ సినిమా చేస్తున్నాం. మద్రాసులో ఎక్కడో దూరంగా షూట్ చేస్తున్నాం. ప్రతి రోజు అతడు మాతో పాటు కలిసి వచ్చేవాడు. ఆ రోజు రాలేదు. అతడికి వేరే షూటింగ్ ఉంటే చెప్పి పర్మీషన్ తీసుకునేవాడు. కానీ, ఆ రోజు ఎవరికీ చెప్పలేదు. మధ్యాహ్నం వరకు చూశాం, రాలేదు. దాసరి గారు అప్పటికీ అంటూనే ఉన్నారు. మధ్యాహ్నం అయ్యింది రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదంటున్నారు. ఇంటికి ఫోన్ చేశాం. రాత్రి మీ దగ్గరికే వస్తానని చెప్పి బయల్దేరారండీ అన్నారు. ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. దాసరి గారు అందరికీ చెప్పి, మిగతా కంపెనీలో పని చేస్తున్నాడో వెతకండి అన్నారు. ఎక్కడా అతడు కనిపించలేదు. సమీపంలోని ఓ వ్యక్తి వచ్చి రైల్వే ట్రాక్ దగ్గర ఓ వ్యక్తి కనిపించాడండీ, ఫేస్ కనిపించడం లేదు. చూడ్డాని గూర్ఖాలా ఉన్నాడని చెప్పాడు. ఇంటికి ఫోన్ చేసి రాత్రి ఏ డ్రెస్ వేసుకున్నాడు? అని అడిగితే, ఖాకీ డ్రెస్ వేసుకున్నాడని చెప్పారు. బాడీ రైల్వే స్టేషన్ దగ్గర హాస్పిటల్ లో ఉంచారు. నేను, మోహన్ బాబు వెళ్లి చూస్తే, చలం డెడ్ బాడీ. షాక్ అయ్యాం. మరుసటి రోజు ఆయన అంతిమ యాత్రను దాసరి గారు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఘన వీడ్కోలు పలికాం. సాంబ్రానీ పొగలు వేశాం. కొన్ని ఏళ్ల వరకు అగర్ బత్తి పొగ పీల్చితే ఆ డెడ్ బాడీ గుర్తుకు వచ్చేది” అన్నారు.


Read Alos: వివాదంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సాంగ్, పూరీ జగన్నాథ్ పై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం? కారణం ఏంటో తెలుసా?