Buddy Movie Release Date: టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లువారబ్బాయి నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెలాఖరున విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. 


'బడ్డీ' చిత్రాన్ని ముందుగా జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చెయ్యాలని నిర్మాతలు భావించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకుని, వారం రోజులు సినిమాని వాయిదా వేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా 'బడ్డీ వస్తున్నాడు.. క్యాలెండర్‌లో డేట్‌ను మార్క్ చేసుకోండి.. థియేటర్లలో కలుసుకుందాం' అని అల్లు శిరీష్ పోస్ట్ పెట్టారు.






జూలై 26న కోలీవుడ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయాన్’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇది ధనుష్ కెరీర్ లో 50వ చిత్రం. పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అల్లు శిరీష్ నటించిన ‘బడ్డీ’ సినిమాని ఆగస్టు ఫస్ట్ వీక్ కి పోస్టుపోన్ చేసినట్లుగా తెలుస్తోంది.


యాక్షన్ ప్యాకెడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా 'బడ్డీ' సినిమా రూపొందుతోంది. ఈ కథలో ఒక టెడ్డీ బేర్‌ కీలకంగా ఉండబోతోంది. టెడ్డీ బేర్‌ హీరోతో కలిసి అన్యాయంపై పోరాటం చేయడం అనే డిఫరెంట్‌ స్టోరీ లైన్ తో తెరకెక్కినట్లుగా ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇదొక కొత్త అటెంప్ట్ అని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించగా.. ముఖేష్ కుమార్, అలీ ఇతర పాత్రల్లో నటించారు. 


'బడ్డీ' చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఆర్ సెంథిల్ ఆర్ట్ డైరెక్టర్ గా, రూబెన్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన అల్లు శిరీష్ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే చెప్పాలి. వైవిధ్యమైన సినిమాలు ట్రై చేస్తున్నా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. చివరగా ఆయన నటించిన 'ఏబీసీడీ', 'ఊర్వశివో రాక్షసివో' సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. దీంతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు 'బడ్డీ' మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.


Also Read: దీపికా 1000 కోట్ల హ్యాట్రిక్ - పెద్ద సినిమాలకు గోల్డెన్ లెగ్‌గా మారిన సొట్టబుగ్గల సుందరి!