మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలతో మొదలుకొని స్టార్ హీరోలు సైతం ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది ఫెయిల్యూర్స్ ని చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాత్రం ఈ సీక్వెల్ ట్రెండ్ తోనే ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ ట్రెండ్ నిఖిల్ కి బాగా కలిసి వచ్చింది. ఎంతలా అంటే ఇప్పుడు మరో సినిమాకి సీక్వెల్ చేసేంతలా! ఇంతకీ అది ఏ సినిమా సీక్వెల్ అనేది ఇప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం.. నిఖిల్ కెరియర్ లో హిట్ మూవీగా నిలిచిన 'కార్తికేయ'కి గత ఏడాది సీక్వెల్ గా 'కార్తికేయ2' వచ్చి పాన్ ఇండియా వైడ్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే.


బాక్స్ ఆఫీస్ వద్ద 'కార్తికేయ2' ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే నిఖిల్ ఇప్పుడు మరో సీక్వెల్ కి సిద్ధమవుతున్నారట. ఆ సినిమా మరేదో కాదు నిఖిల్ కెరియర్లో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ నటించిన సినిమా ఇది. మేఘన ఆర్ట్స్ బ్యానర్ పై పీవీ రావు నిర్మించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన అవికా గోర్, హెబ్బా పటేల్, నందిత శ్వేత హీరోయిన్స్ గా నటించారు. 2016లో నవంబర్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని ఘన విజయం సాధించింది. అంతేకాదు 'కార్తికేయ 2' సినిమా రాకముందు నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.


ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వి ఐ ఆనంద్, నిఖిల్ కాంబోలో రాబోతున్న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా 2' ప్రాజెక్ట్ ని జిఏ 2 పిక్చర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. నిఖిల్ జీ ఏ పిక్చర్స్ నిర్మాణంలో ఇప్పటికే '18 పేజెస్' అనే సినిమా చేశాడు. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థతోనే రెండో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక నిఖిల్ ఇటీవల 'స్పై' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 29 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ సినిమాకి కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.


'స్పై' తర్వాత ప్రస్తుతం నిఖిల్ చేతిలో 'స్వయంభు', 'ది ఇండియన్ హౌస్' వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటితోపాటు రీసెంట్గా సుధీర్ వర్మ దర్శకత్వంలోను ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాల తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సీక్వెల్ పట్టాల్లెక్కే అవకాశం ఉంది. మరోవైపు దర్శకుడు వి.ఐ ఆనంద్ ప్రస్తుతం సందీప్ కిషన్ తో 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, నిజమేనే చెబుతున్నా అనే సాంగ్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను దక్కించుకున్నాయి. సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : విస్కీ పూరితో వెరైటీ మాస్ ఇంట్రో - శివన్న కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial