యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నట సింహం నందమూరి బాలకృష్ణ మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపించాయి. తారకరత్న మరణం తర్వాత వీరి మధ్య మరింత గ్యాప్ వచ్చినట్లు ఊహాగానాలు వచ్చాయి.  ఈ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్, తన తాతా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనలేదనే టాక్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ లాంటి వారు ఎన్టీఆర్ మరణానికి కారణం అయిన వారితో కలిసి వేదిక పంచుకోలేకే జూనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు దూరంగా ఉన్నారని చెప్పారు. నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆరే నిజమైన మగాడు అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. అయితే, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గానీ, అటు బాలయ్య గానీ, ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.


ఎన్టీఆర్ తో మోక్షజ్ఞ ఆలింగనం


తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఫోటో సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. నందమూరి బాలకృష్ణ కొడుకు  మోక్షజ్ఞ, జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయతతో ఆలింగనం చేసుకుంటున్న ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రీసెంట్ గా నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ వివాహ వేడుకలో ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మోక్షజ్ఞ బయట కనిపించడం చాలా అరుదు. కానీ, తాజాగా అన్న ఎన్టీఆర్ ను  ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, ఆ ఫోటో బయటకు రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.






ఆ వార్తలకు చెక్ పడినట్లేనా?   


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఫోటో ఎన్నో ఊహాగానాలకు చెక్ పెట్టిందంటున్నారు సినీ ప్రముఖులు.  బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య విభేదాలు లేవు అని చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనం అందుకున్నారు. ఒకవేళ వీరిద్దరి మధ్య గొడవలు ఉంటే ఇంత ఆప్యాయంగా ఎన్టీఆర్, మోక్షజ్ఞ ఆలింగనం చేసుకునేవారు కాదని చెప్తున్నారు. మొత్తంగా గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఈ ఫోటోతో చెక్ పడినట్టేనంటున్నారు.


‘దేవర’ చిత్రంతో ఎన్టీఆర్ బిజీ బిజీ


ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తను నటిస్తున్న ‘దేవర’ హిట్ అవ్వాల్సిందే అని కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.  ఇప్పటికే ‘దేవర’ క్యాస్టింగ్‌తో ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ చిత్రంతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటిసారిగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.  తమిళ రాక్‌స్టార్ అనిరుధ్.. దేవరకు మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే దసరా లాంటి కమర్షియల్ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన షైన్ టామ్ చాకో కూడా దేవరలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘దేవర’.. 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.     


Read Also: చంద్రుడి మీద భూమిని కొనుగోలు చేసిన హీరోలు వీళ్లే! మీరు కూడా కొనుక్కోవచ్చు, ధర ఎంతంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial