సినీ సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసుండడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. అలాగే పెళ్లికి ముందు తల్లిదండ్రులతో కలిసుండే హీరో.. పెళ్లి తర్వాత భార్యతో వేరు కాపురం పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరో కూడా అదే చేశాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య.. 2022లో తను ప్రేమించిన అనూష శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే అనూషతో కలిసి శౌర్య వేరు కాపురం పెట్టాడని ప్రచారం సాగుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి.. తన కొడుకు వేరు కాపురం విషయంపై క్లారిటీ ఇచ్చారు.


రెండు సినిమాలు ఫ్లాప్..
నాగశౌర్య హీరోగా తగిన గుర్తింపు సంపాదించుకున్న తర్వాత తన తల్లి ఉషా మల్పూరి నిర్మాతగా మార్చి సొంత బ్యానర్‌ను స్థాపించాడు. అదే ఐరా క్రియేషన్స్‌. ఈ బ్యానర్‌పై తన తల్లి నిర్మాతగా, శౌర్య సహ నిర్మాతగా పలు సినిమాలు కూడా తెరకెక్కాయి. 2023లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. అదే ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’, ‘రంగబలి’. ఈ రెండు చిత్రాలపై నాగశౌర్య.. ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నా.. ఇవి బాక్సాఫీస్ వద్ద డిసాస్టర్‌గా నిలిచాయి. ఇదిలా ఉండగానే.. శౌర్య పర్సనల్ లైఫ్ గురించి పలు వార్తలు సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.


పెళ్లికి ముందే మాట్లాడుకున్నాం..
న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసుకొని.. ఇంటీరియర్ డిజైనర్‌గా సొంత కంపెనీ పెట్టుకున్న అనుష్క శెట్టిని నాగశౌర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2022 నవంబర్ 20న వీరి వివాహం జరిగింది. బెంగుళూరుకు చెందిన అనూష.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయి.. ఇక్కడే ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. అయితే పెళ్లయిన కొన్నిరోజులకే వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టారని రూమర్స్ వచ్చాయి. తాజాగా శౌర్య తల్లి ఉషా.. అవి రూమర్స్ కాదని, నిజమే అని క్లారిటీ ఇచ్చారు. పెళ్లయిన కొన్నిరోజులకే వారు వేరు కాపురం పెట్టారని, ఇదంతా పెళ్లికి ముందే మాట్లాడుకున్నామని రివీల్ చేశారు.


ఆలోచించడానికి, అనుకోవడానికి ఏమీ లేదు..
అనూష చాలా మంచి పిల్ల అని తన కోడలి గురించి చెప్పుకొచ్చారు ఉషా మల్పూరి. శౌర్యతో పెళ్లికాకముందు నుండే అనూషతో పరిచయం ఉందని అన్నారు. శౌర్యతో తన జోడీ బాగుంటుందని అనిపించి పెళ్లి జరిపించామని తెలిపారు. తనను ఎప్పుడూ కోడలిలాగా కాకుండా కూతురిలాగానే చూశామని, తను కూడా అలాగే చూసుకునేదని బయటపెట్టారు. అంతే కాకుండా అత్త, మామను మమ్మీ, డాడీ అని పిలుస్తుందని కూడా చెప్పారు. తను ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొనే ఆఫీసుకు వెళ్తుందని, బాగా ఆలోచించే అమ్మాయి అని అనూష గురించి సర్టిఫికెట్ ఇచ్చారు ఉషా. శౌర్య, అనూష వేరుగా ఉండాలని ముందు నుండే అనుకున్నారని, ఈ తరంలో పిల్లలకు స్వేచ్ఛ కావాలి కాబట్టి వారికి ఇచ్చామని తెలిపారు. ఇందులో వేరుగా ఆలోచించడానికి, అనుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు ఉషా మల్పూరి.


Also Read: హీరో విజయ్‌పై చెప్పుతో దాడి - అజీత్ ఫ్యాన్స్ నుంచి ఊహించని స్పందన, వాడిని పట్టుకుంటారట!